సచివాలయంలో సందర్శకులకు ’నో ఎంట్రీ’

by  |
Secretariat
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. సచివాలయంలో సుమారు 200 మంది ఉద్యోగులకు కరోనా సోకిన నేపథ్యంలో ఇకపైన సందర్శకులకు ప్రవేశం లేదని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రతీరోజూ సందర్శకులకు ఇచ్చే తాత్కాలిక పాస్‌ల జారీని నిలిపివేయాలని అన్ని విభాగాల హెడ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సంబంధిత అధికారి అనుమతి ఉన్నవారికి మాత్రమే అప్పటికప్పుడు ఎంట్రీ పాస్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ జాగ్రత్తలకు తోడు సోషల్ డిస్టెన్స్, మాస్కు, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రత, వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తక్షణం ఇది అమలులోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు కొనసాగుతుందని సీఎస్ ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 61 మందికి పాజిటివ్ వచ్చినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు వారం రోజుల క్రితమే సీఎస్‌కు వివరించి యాభై శాతం మంది ఉద్యోగులే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోజు విడిచి రోజు మాత్రమే విధులకు హాజరయ్యేలా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మరికొన్ని పాజిటివ్ కేసులు వచ్చి సుమారు 200 మంది వైరస్ బారిన పడినట్లు ఉద్యోగ సంఘాల అంచనా. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి సందర్శకులకు ఆంక్షలు జారీ చేయడం గమనార్హం.


Next Story