పేరుకే PHC భవనం.. సౌకర్యాలు మాత్రం ‘సున్నా’..

by  |
పేరుకే PHC భవనం.. సౌకర్యాలు మాత్రం ‘సున్నా’..
X

దిశ, వీర్నపల్లి : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వీర్నపల్లి మండలం సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. గ్రామస్థాయిలో ఉన్న అసౌకర్యాలు ఐదేళ్లుగా కొనసాగడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలలో ప్రాథమిక అవసరమైన ఆరోగ్య సేవలు ఆమడ దూరంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. వీర్నపల్లి గ్రామంగా ఉన్న సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దాదాపు 10 లక్షల వ్యయంతో నిర్మించారు. ఆ సమయంలో వారానికి లేదా పక్షం రోజులకు ఏఎన్ఎం, ఆపై స్థాయి వైద్యులు వచ్చి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించే వారని స్థానికులు పేర్కొన్నారు. వీర్నపల్లి మండలంగా ఏర్పడిన తర్వాత ఈ సౌకర్యాలు మెరుగు పడాల్సింది పోయి అసలు పట్టించుకునే నాథుడే లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అలంకార ప్రాయంగానే..

మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రమాదం జరిగితే ఆపదలో ఆదుకునే 108 వాహనం, ఏఎన్ఎం, ఆశా వర్కర్ అందుబాటులో ఉన్న వారి సేవలు ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలు ఉన్నాయి. వీరికి అదనంగా ఓఎంబీబీఎస్ స్థాయి వైద్య అధికారిని నియమించాలని డిమాండ్ వినిపిస్తోంది. మండలానికి సమీపంలో 17 గ్రామాలు.. దాదాపు 17 వేల మంది జనాభా ఉన్న మండలానికి వైద్యుడు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అసలే మండలంలో అనేక తండాలు ఉండి ఈ మధ్య గ్రామ పంచాయతీలుగా కూడా ఏర్పడినాయి. ఈ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతుంటాయి. ఇలాంటి చోట మొబైల్ వైద్య సేవలు అందించే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఆర్ఎంపీలు, ప్రైవేటుకు పరుగులు..

వ్యవసాయ అటవీ ప్రాంత పనులపై ఆధారపడి జీవించే మండల ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వైద్య పరీక్షల నిమిత్తం ఆర్ఎంపీలను ఆశ్రయించడం, అక్కడ కాదంటే ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీయడం ప్రజలకు అలవాటుగా మారింది. తెలిసి తెలియకుండా అందించే వైద్యం వలన అది వికటించి మరణించిన వారి జాబితా ఇప్పటికీ లెక్కేలేదు. మెరుగైన వైద్యం కోసం 30 నుంచి 60 కిలోమీటర్లు పరుగులు పెడితే తప్పా అధికారిగా అర్హత ఉన్న వైద్యులతో చికిత్స పొందే అదృష్టం మండల ప్రజలకు లేదనే చెప్పాలి.

గ్రామాలను మండలాలుగా, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని చెప్పుకునే అధికార పార్టీ పాలకులు ఇప్పటికైనా మారుమూల మండల ప్రాంతాల్లో కనీస అవసరమైన వైద్య సేవలు అందించే విధానాలపై దృష్టి సారించాలని మండలంలోని ప్రతీ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ దత్తత ప్రాంతమైన వీర్నపల్లిలో ఇలాంటి దుస్థితి ఉంటే మిగతా మండలాల్లో పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో పల్లె దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన విధంగా ముందుగా మారుమూల మండల ప్రాంతమైన వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed