కాంగ్రెస్‌లో మరోసారి సీల్డ్ కవర్ దుమారం..!

by  |
huzurabad-revanth
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీలో పాత కథే పునరావృతమవుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. హుజురాబాద్​ఉప ఎన్నికలో బరికి దింపే అభ్యర్థిపై సాగదీస్తూనే ఉంది. తాజాగా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలంటూ టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​మహేష్​కుమార్​ప్రకటించడం మరింత చర్చగా మారింది. ఉప ఎన్నికలయ్యే వరకు కూడా ఈ విషయాన్ని తేల్చరంటూ సొంత పార్టీలోనే సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఇది ఒడవని ముచ్చటే అంటూ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హుజురాబాద్​ఉప ఎన్నిక అభ్యర్థి కోసం దామోదర రాజనర్సింహా బృందం రెండుసార్లు పర్యటించి నివేదికను సమర్పించింది. స్థానిక నేతలకు అవకాశం కల్పించాలంటూ సూచించింది. అనంతరం పరిణామాల్లో అనూహ్యంగా కొండా సురేఖ పేరు పరిగణలోకి వచ్చింది. సురేఖను అక్కడి నుంచి పోటీకి దింపాలంటూ టీపీసీసీలోని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఎన్నికల నిర్వహణ కమిటీ మాత్రం అడ్డుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్​ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. కరీంనగర్​ పార్లమెంట్​స్థాయి సమావేశాన్ని సైతం నిర్వహించారు. అక్కడి పార్టీ నేతలతో మాట్లాడారు. కానీ కరీంనగర్‌లో తేల్చకుండానే వచ్చారు. మరుసటి రోజున గాంధీభవన్‌లో సమావేశమై హుజురాబాద్ అంశంపైనే మాట్లాడారు. దీనిలో టీపీసీసీ నుంచి అభిప్రాయం తీసుకుని అభ్యర్థి పేరును సీల్డ్​కవర్‌లో అధిష్టానానికి పంపించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

హుజురాబాద్‌పై మళ్లీ మొదటికి..

హుజురాబాద్‌లో హస్తం పార్టీ అభ్యర్థిపై మళ్లీ మొదటికొచ్చారు. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, వరంగల్, కరీంనగర్​డీసీసీ ప్రెసిడెంట్లు​నాయిని రాజేందర్​రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణతో ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. ఈ బృందం ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటుందని, దరఖాస్తుతో పాటు రూ.5 వేల డీడీ ఇవ్వాలని, అనంతరం వారిని ఇంటర్వ్యూ చేస్తారంటూ ప్రకటించారు. ఈ నెల 10 తర్వాత ఏఐసీసీకి నివేదిస్తామని, ఆ తర్వాత ప్రకటిస్తామన్నారు.

ఇప్పటికే హుజురాబాద్‌లో రెండు ప్రధాన పార్టీలు మకాం వేశాయి. మొత్తం గ్రామాలను జల్లెడ పడుతున్నారు. ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి వేటలోనే మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెలలోనైనా అభ్యర్థిని తేల్చుతారా.. ఉప ఎన్నిక తర్వాత ప్రకటిస్తారా అంటూ సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు.

Next Story

Most Viewed