థర్డ్‌వేవ్‌కు ‘నో’ ఛాన్స్.. చిన్నారులూ సేఫ్

by  |
Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : థర్డ్ వేవ్ ‘అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది’ అని ఆందోళన రేకిత్తించే సర్వేలను చూసి టెన్షన్ పడుతున్న ప్రజలకు ఆరోగ్యశాఖ ఉపశమనం కలిగించే విషయాన్ని వెల్లడించింది. మన రాష్ర్టంలో మూడో దశ ఎట్టి పరిస్థితుల్లో రానేరాదని కొట్టిపరేసింది. అనవసరంగా మనోధైర్యాన్ని కోల్పోయి మానసిక ఒత్తిడికి గురికావొద్దని సూచించింది. వైరస్ బారిన పడటం ద్వారా, వ్యాక్సిన్ తీసుకోవడం వలన సుమారు 85 శాతం మందిలో కరోనాకు వ్యతిరేఖంగా పోరాడే యాంటీబాడీస్(ప్రతిరక్షకాలు) ఉత్పత్తి అయినట్టు గుర్తించామని, వీటి ప్రభావంతో డిసెంబరు వరకు వైరస్ నుంచి రక్షణ పొందవచ్చునని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేనే లేదన్నది. ఆ తర్వాత కూడా మాస్కు, భౌతిక దూరం వంటివి పకడ్భందీగా పాటిస్తే మార్చి వరకు మనం సేఫ్ అని ఊపిరి పీల్చుకునే విషయాన్ని చెప్పింది. ప్రస్తుతానికి మన రాష్ర్టంలోని వేరియంట్లను తట్టుకునే శక్తి మెజార్టీ ప్రజల్లో ఉన్నదని, దీంతోనే థర్డ్ వేవ్ రాదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

కొత్త వేరియంట్ తోనే..

థర్డ్ వేవ్ రావాలంటే ఇప్పుడున్న వైరస్ వేరియంట్లు కాకుండా కొత్తగా మరో బలమైన వేరియంట్ పుడితేనే వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ అధికారులు నమ్ముతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు న్యూ వేరియంట్ వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత వైరస్‌లు జన్యుమార్పిడి పొంది కొత్త వేరియంట్‌గా మార్పు చెందాలంటే సుమారు మార్చి వరకు సమయం పడుతుందని ఇటీవల సీసీఎంబీ కూడా ప్రభుత్వానికి అంతర్గత నివేదికను సమర్పించినట్టు అధికారులు వివరించారు. కానీ ఆ వేరియంట్‌లు ఇప్పుడున్న వాటికంటే బలంగా ఉంటేనే వ్యాప్తి పెరుగుతుందన్నారు.

ప్రస్తుత వేరియంట్ల కంటే బలంగా తయారయ్యే చాన్స్ కేవలం 10 శాతం మాత్రమే ఉన్నదని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయని, దీంతోనే థర్డ్ వేవ్ ముచ్చట ఇప్పట్లో లేదనే ధీమాతో ఉన్నామని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ మార్చి తర్వాత థర్డ్ వేవ్ వచ్చినా సెకండ్ వేవ్ అంతా ప్రభావం మాత్రం చూపదని మరోసారి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి ఉండబోదని, కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే కేసులు పెరిగే అవకాశం ఉన్నదన్నారు.

చిన్నారులకు ముప్పు లేనట్టే…

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై అత్యధిక ప్రభావం చూపుతుందని వేర్వేరు సర్వేలు సూచిస్తున్నప్పటికీ, మన రాష్ర్టంలో ఆ పరిస్థితులు ఉండబోవని వైద్యాధికారులు చెబుతున్నారు. మొదటి, రెండో వేవ్‌లలో 10 ఏళ్ల లోపు వారు కేవలం 2.9 శాతం మంది మాత్రమే వైరస్ బారిన పడ్డారు. ఇమ్యూనిటీ వృద్ధి చెందే సమయంలో వైరస్ దాడి చేయడం కాస్త కష్టమని పీడియాట్రిక్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీంతో చిన్నారులకు ముప్పు అనే దానిలో వాస్తవం లేదన్నారు. మరోవైపు పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లతోనూ గతంలో పెరిగినట్టు ఇప్పుడు కేసులు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయడనికి ఇదే నిదర్శనమన్నారు.

మార్చి వరకు ధైర్యంగా ఉండొచ్చు: డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు

కరోనా థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే. మార్చి వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. అట్లాగని మాస్కు, భౌతికదూరం వంటివి మరువద్దు. 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి కావడం వలనే వ్యాప్తి ఉండదని నిర్ధారించాం. ఈ నెలాఖరు వరకు 100 శాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేస్తాం. డిసెంబరు వరకు కేసులు తీవ్రత ఇలానే కొనసాగుతుంది. ప్రజలంతా టెన్షన్ పడి ఇతర అనారోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు. పిల్లలను ధైర్యంగా బడికి పంపండి. అక్కడక్కడ పాజిటివ్‌లు వచ్చినా, వారికి చికిత్సను అందించేందుకు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాం.

Next Story

Most Viewed