ప్రశంసలు ఓకే.. మరి ప్రోత్సాహకాలు ఏవి?

by  |
ప్రశంసలు ఓకే.. మరి ప్రోత్సాహకాలు ఏవి?
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్టు తయారైంది బల్దియా పరిధిలోని పారిశుధ్య కార్మికుల పరిస్థితి. కరోనా వారియర్స్‌గా ముందుండి పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రోత్సాహకాలు రెండు నెలలు దాటినా అందడం లేదు. ప్రకటన చేసి రెండు నెలలు దాటినా ప్రోత్సహకాలు అందకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి తమను గుర్తించి తమకు అండగా నిలిచేందుకు ప్రోత్సాహకం ప్రకటించినా క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అందుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. పారిశుద్య కార్మికులను కరోనా వారియర్స్ అంటూ అభినందనలు చెబుతూ లాక్‌డౌన్ తొలి రోజుల్లోనే కార్మికులకు నెలకు రూ.7,500 చొప్పున ప్రోత్సాహకం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతీ కార్మికుడికి ఈ ప్రోత్సహకం అందిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆనందంలో కార్మికులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్ స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలు దాటినా ప్రోత్సహకం అందడం లేదు.

గతంలో ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో కార్మికులకు ఆలస్యంగా ప్రోత్సహాకాలు అందాయి. తాజాగా ఫలక్‌నుమా, చార్మినార్ సర్కిల్ పరిధిలోని ఎస్‌ఎఫ్‌ఏలు, కార్మికులు కలిపి 72 మందికి రెండు నెలల ప్రోత్సాహకం అందలేదు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కంటైన్‌మెంట్ జోన్లలోనూ వీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని అధికారులు నిర్లక్ష్యం కారణంగానే వీరికి డబ్బులు అందలేదని తెలుస్తోంది. ఆయా సర్కిల్ అధికారులను ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. గ్రేటర్‌లో అందరికీ ప్రోత్సహకం లభించినా తమకు అందలేదని, త్వరగా అందించి ఆర్థికంగా అండగా నిలవాలని కోరితే ప్రధాన కార్యాలయంలోని కొందరు ఉన్నతాధికారులు చులకనగా మాట్లాడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. అయితే, సర్కిల్ పరిధిలోని అధికారులే ఈ విషయానికి బాధ్యులని, తమకు ఫైల్ ఇప్పుడే చేరిందని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు పంపించిన వివరాల ప్రకారం మొదటి నెలలోనే అందరికీ జమా చేశామని, వీరికి మాత్రమే రాకపోవడానికి తాము బాధ్యులం కాదని వివరించారు.

Next Story

Most Viewed