తల్లిదండ్రుల చెంతకు బాలిక.. కిడ్నాపర్‌పై ఫోకస్ పెట్టిన సీపీ కార్తీకేయ

by  |
తల్లిదండ్రుల చెంతకు బాలిక.. కిడ్నాపర్‌పై ఫోకస్ పెట్టిన సీపీ కార్తీకేయ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలో షాపింగ్ మాల్‌లో కిడ్నాప్ అయిన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పినట్టు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తీకేయ తెలిపారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో బాలిక కిడ్నాప్, ట్రేసింగ్ పై విలేకరుల సమావేశం నిర్వహించారు. సీపీ కార్తీకేయ కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం నాందేడ్ జిల్లా నర్సీలో నిజామాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలిక ఆస్కియా హాని(3) ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. నిజామాబాద్ పోలీసు అధికారులను పంపించి బాలికను క్షేమంగా జిల్లా కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. తల్లిదండ్రులతో బాలిక చేత వీడియో కాల్ మాట్లాడించి నిర్ధారణ చేసినట్లు సీపీ తెలిపారు. బాలికను నిజామాబాద్‌కు తరలించి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చామన్నారు.

ఈ నెల 8న నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఆస్కియా హాని(3) కిడ్నాప్‌కు గురైందని సీపీ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి‌కి చెందిన అస్కియా హానీ తన తల్లి, అమ్మమ్మతో షాపింగ్‌‌కు వచ్చి కిడ్నాప్‌కు గురయిందని గుర్తు చేశారు. ఒక మహిళ మాయమాటలు చెప్పి ఆటో లో బోధన్ రోడ్ వరకు ప్రయాణించినట్టు సీసీ టీవీ విజువల్స్ ద్వారా గుర్తించామన్నారు. అదే రోజు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టామన్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

నిజామాబాద్‌కు మహారాష్ట్ర చెంతనే ఉండడంతో అక్కడ కూడా సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు బాలిక ఫొటోలను మహారాష్ట్ర పోలీస్ స్టేషన్‌లలో పంపి అప్రమత్తం చేసినట్లు సీపీ తెలిపారు. బాలిక కిడ్నాప్ వ్యవహారం మహారాష్ట్ర వరకు పాకడంతో కిడ్నాపర్ ఆమెను నర్సీ వద్ద వదిలిపోయిందని భావిస్తున్నట్లు తెలిపారు. నర్సీ పట్టణంలో పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికను ఓ వ్యక్తి చేరదీసి, సోషల్ మీడియాలో వచ్చిన బాలిక ఫోటోను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడని క్లారిటీ ఇచ్చారు. దీంతో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైందన్నారు. అయితే కిడ్నాపర్ ఎవరని గుర్తించేందుకు సీసీ టీవీ పుటేజీల పరిశీలనకు స్థానిక మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకుంటామని తెలిపారు.



Next Story

Most Viewed