ముంచుకొస్తున్న ‘నివర్’..

by  |
ముంచుకొస్తున్న ‘నివర్’..
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెమ్మదిగా తన ప్రభావం చూపుతోంది. నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే 7 జిల్లాలు, డెల్టా ప్రాంతాల్లో తమిళ సర్కార్ ప్రజా రవాణాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 13 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లోని అన్ని వ్యాపార సముదాయాలను మూసివేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంట గంటకు తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిని నివర్ తుఫాన్‌గా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. ఇది తీరం దాటే సమయంలో గంటకు 120కిమీ వేగంతో ఈదరుగాలులు వీస్తాయని హెచ్చరించింది.తుఫాన్ దెబ్బకు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నది. కాగా, ఈ నెల 25న తమిళనాడులోని మమాళ్ల పురం-కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీఅయ్యాయి.



Next Story