ఇప్పట్లో పన్ను తగ్గింపులుండవు: నిర్మలా సీతారామన్

by  |
ఇప్పట్లో పన్ను తగ్గింపులుండవు: నిర్మలా సీతారామన్
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఇప్పటికే రూ.20 లక్షల కోట్లను ప్రకటించామని, ప్రస్తుతానికి ఇదే.. కొత్త ఉద్దీపనలుండవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొన్నాళ్లు గడిచాక పరిస్థితులను మదింపు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, ప్రస్తుతానికి ఆదాయ పన్నులు, ఇతర పరోక్ష పన్నుల్లో ఎలాంటి తగ్గింపులు ఉండవని, కోతలేమీ ప్రకటించమని చెప్పారు. ఇలాంటి సమయంలో ఎటువంటి పన్ను సంబంధిత అంశాలు పరిశీలించడం లేదంటూ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాలను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి.. తాము ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీతో పరిశ్రమలు, వ్యాపారాలు నిలదొక్కుకుంటాయని, వేతన జీవులకు తిరిగి జీతాలు అందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభ సమయంలో రెండు ప్యాకేజీలను ఇచ్చామని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు నేరుగా నగదు సాయం చేయట్లేదనే విమర్శలకు స్పందించిన ఆర్థిక మంత్రి.. జనం నిత్యావసరాలు కొనుగోళ్లు చేసినంత మాత్రాన డిమాండ్ పెరగదని, చిన్న వ్యాపార సంస్థలు ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితి ఉంటేనే సాధ్యమని చెప్పారు. వడ్డీ వ్యయాలు తగ్గి మూలధన సాయం పెరగాల్సి ఉందని, కంపెనీలు ముడి పదార్థాలను కొనుగోలు చేయాలని.. ఈ పరిస్థితులు ఉంటేనే డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. వ్యాపార పునరుద్ధరణ జరిగితే ఉద్యోగులకు జీతాలు అందుతాయని, అప్పుడు ప్రజల వద్ద నగదు ఉంటుంది, కొనుగోళ్లు పెరుగుతాయని చెప్పారు. దేశంలోని ఎమ్ఎస్ఎమ్ఈలు డిమాండ్‌ను పెంచడంలో కీలకపాత్ర వహిస్తాయని, దేశీ కంపెనీల్లో విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున వాటాలను కొనుగోలు చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిమితులను ప్రకటిస్తుందని, దేశీయ కంపెనీలను విదేశీయులు చౌకగా దక్కించుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


Next Story