మరో ఉద్దీపన ప్యాకేజీ ఇస్తామన్న ఆర్థిక మంత్రి!

by  |
మరో ఉద్దీపన ప్యాకేజీ ఇస్తామన్న ఆర్థిక మంత్రి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు మరోసారి అదనపు చర్యలను, ఆర్థిక ఉద్దీపనలను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచబ్యాంకు అభివృద్ధి కమిటీ ప్లీనరీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఆర్థిక ఉద్దీపనతో పాటు పేదలకు, బాధిత వర్గాల ప్రజల కోసం అవసరమైన ఉపశమన చర్యలను చేపడతామని అన్నారు. అవసరమైన దేశాలకు కావాల్సిన ఔషధాల సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి వివరించారు. ఇప్పటికే రూ. 1.7 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ఆరోగ్య కార్యకర్తలకు ఆరోగ్య బీమా, ఉచిత ఆహారం, గ్యాస్, నగదు బదిలీ, బాధితులైన కార్మికులకు అదనపు భద్రతా చర్యలు అందించామని సమావేశంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు.

త్వరలో అదనపు ఉపశమనంలో భాగంగా మరోసారి ఆర్థిక ఉద్దీపన అందించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆమె తెలిపారు. అయితే, మంత్రి దానికి తగిన స్పష్టత ఇవ్వలేదు. జనాభా పరిమాణాన్ని బట్టి కరోనా వల్ల ఇండియాలో మరింత నష్టం కలిగే అవకాశముందని, ప్రభుత్వం దానికి తగిన చర్యల కోసం భారీ ప్రయత్నాలను మొదలుపెట్టిందని చెప్పారు.

Tags: Economic Stimulus, Nirmala Sitharaman, Finance Minister, FM


Next Story