Sensex:అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లో సూచీలు

by  |
Sensex:అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లో సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాల నుంచి బ్రేక్ తీసుకున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడిన సూచీలు చివరికి నష్టాలను చవిచూశాయి. మిడ్-సెషన్ వరకు ఫ్లాట్‌గా కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివర్లో కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, వాహనాల ధరల పెంపుతో ఆటో పరిశ్రమలో కొనుగోళ్ల ఉత్సాహం ఉన్నప్పటికీ, గత కొన్ని సెషన్ల నుంచి రికార్డు గరిష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 282.63 పాయింట్లు కోల్పోయి 52,306 వద్ద ముగియగా, నిఫ్టీ 85.80 పాయింట్లు నష్టపోయి 15,686 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా 1 శాతానికి పైగా డీలాపడింది. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు నీరసించాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.24 వద్ద ముగిసింది.


Next Story

Most Viewed