దారుణం : కోడలు దగ్గరకు రావడం లేదని అత్త ఏం చేసిందంటే..

by  |
దారుణం : కోడలు దగ్గరకు రావడం లేదని అత్త ఏం చేసిందంటే..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : తల్లి తర్వాతి తల్లి స్థానంలో ఉండాల్సిన అత్తే దారుణంగా ప్రవర్తించింది. కరోనా బారిన పడినా తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న కోడలిపైనే తన ప్రతాపం చూపించింది. వైరస్‌ను కోడలికి అంటించి ఇంట్లోంచి గెంటేసింది. ఈ దారుణమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట సమీపంలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల కిందట పెళ్లైంది. భర్త ఉపాధి కోసం ఒడిశాలో డ్రైవర్‌గా పని చేసేందుకు వెళ్లాడు. మెట్టినింట్లో అత్తా కోడళ్లు, ఇద్దరు పిల్లలు కలిసి ఉంటున్నారు. ఐదు రోజుల కిందట అత్తకు కరోనా నిర్దారణ జరిగింది. దీంతో ఆమె హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది.

అత్తకు దూరంగా ఉంటూ కోడలు తన పనులు తాను చేసుకుంటోంది. అంతేకాకుండా ఆమెకు అన్నివిధాలా సాయపడుతోంది. అయితే, కోడలు తనను ముట్టు కోకపోవడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కావాలనే కోడలిని తరచూ ఆలింగనం చేసుకోవడంతో పాటు, పిల్లలను కూడా బలవంతంగా దగ్గరికి తీసుకునేది. అత్త సాన్నిహిత్యం కారణంగా కోడలికి కరోనా సోకింది. చివరకు దానిని సాకుగా చూపి కోడలనే కనికరం కూడా చూపకుండా ఇంట్లోంచి గెంటేసింది. విషయం తెలుకున్న బాధితురాలి సోదరి రాచర్ల గొల్లపల్లిలోని తన సొంతింటికి తీసుకొచ్చి హోం క్వారంటైన్‌లో ఉంచింది. తనకు కరోనా సోకడానికి అత్తే కారణం అని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం లేపింది. కోడలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.



Next Story