టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. పార్టీ మారుతామంటూ కీలక నేతల వార్నింగ్

by Sridhar Babu |   ( Updated:2021-09-18 01:56:55.0  )
trs-flag 1
X

దిశ, భద్రాచలం : అధికార టీఆర్‌ఎస్ పార్టీ చర్ల, దుమ్మగూడెం మండలాల అధ్యక్షుల ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా తయారైంది. ఏకగ్రీవంగా పార్టీ కమిటీలు వేయడం గులాబీ నాయకత్వానికి సాధ్యం కావడంలేదు. గ్రామ కమిటీల సందర్భంగా పార్టీ కేడర్ నడుమ విభేదాల కారణంగా మండల కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికల నాటికి పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యాయి. ముఖ్య నాయకుల ఒంటెద్దు పోకడలే పార్టీలో తలెత్తిన విభేదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

సొంత నిర్ణయాలు తీసుకోలేని నాయకత్వం వలన పార్టీకి నష్టం జరుగుతోందనే విమర్శలు పార్టీ కేడర్‌లో వినిపిస్తున్నాయి. ఈసారి సమర్దవంతమైన నాయకత్వం కోసమే డిమాండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. అందుకే పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా పదవులు దక్కించుకోవడం కోసం నాయకులు దుమ్మగూడెం, చర్ల మండలాల్లో గ్రూపులుగా విడిపోయారు. పదవులు తమ గ్రూపు వారికే ఇవ్వాలని నేతలు మంకుపట్టు పడుతున్నారు. పదవులు దక్కకపోతే పార్టీ వీడుతామని కొందరు నేతలు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో సామాజిక వర్గాలవారీగా సమీకరణాలతో అందరికీ ప్రాతినిధ్యం కల్పించేలా పదవులు పంపిణీ చేయడం అధినాయకత్వానికి ఇబ్బంది అవుతోంది.

పార్టీ పదవుల్లో గిరిజనేతరులకు అవకాశం..

పార్టీలో పనిచేస్తున్న ఓసీ, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్ టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా తెరపైకి వచ్చింది. షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలలో ఎంపీపీ, సర్పంచ్, ఏఎంసీ చైర్మన్ వంటి కీలక పదవులు అన్నీ గిరిజనులకు రిజర్వు అయినందున పార్టీ పదవుల్లో గిరిజనేతరులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజనేతరుల్లో కూడా అగ్రకులాల నాయకులు తమ పరపతి, పలుకుబడి ఉపయోగించి రైతుబంధు వంటి కీలక నామినేటెడ్ పోస్టులు, పార్టీలో జిల్లా స్థాయి పదవులు పొందుతున్న నేపథ్యంలో పార్టీలో బీసీ, ఎస్‌సీలకు కీలక పదవులు లభించడంలేదనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.

ఏజెన్సీలో బీసీ, ఎస్‌సీలు పార్టీ జెండాలు మోయడానికి, బ్యానర్లు కట్టడానికి, పోస్టర్లు వేయడానికే పరిమితమౌతున్నారే తప్ప, ముఖ్య నాయకులుగా ఎదగడంలేదనే అసంతృప్తి కనిపిస్తోంది. మెజారిటీ ఓటు బ్యాంకు కలిగిన తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడంలేదని మదనపడుతున్నారు. పార్టీలో గుర్తింపు ఇస్తున్నామని చెబుతున్నా అట్టి నాయకులకు ఎస్‌సీ సెల్, బీసీ సెల్ పదవులు తప్ప పార్టీలో ఉన్నతమైన పదవులు లభించడంలేదని వాపోతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం తమతో అహర్నిశలు పనిచేయించుకుంటున్న అగ్ర నాయకత్వం కమిటీల ఏర్పాటులో తమకు కీలక పదవులు ఇవ్వకుండా పక్కనబెట్టడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

ఎన్నేళ్ళు పనిచేసినా తాము కులసంఘాలకే పరిమితమా అని ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాత్మక కమిటీల్లో తమకు చోటుదక్కదా అని వారు ఆగ్రహిస్తున్నారు. తాము రాజకీయంగా ఎదగకుండా అగ్రనేతలే అణిచివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం ఈసారి కమిటీల్లో అయినా అధ్యక్ష, కార్యదర్శి వంటి కీలక పదవులు కేటాయించాలని టీఆర్ఎస్ పార్టీలోని బీసీ, ఎస్‌సీలు ముక్తకంఠంతో కోరుతున్నారు.‌ ఆ మేరకు బీసీ, ఎస్‌సీలు ఐక్యతారాగం ఆలపిస్తున్నారు.

టీఆర్ఎస్ మండల కమిటీ ఎన్నికల పరిశీలకుల నియామకం

టీఆర్ఎస్ పార్టీ పటిష్ఠ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల కమిటీల ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజక వర్గాలకు పరిశీలకులను నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఇల్లెందు అసెంబ్లీ నియోజక వర్గానికి డాక్టర్. తెల్లం వెంకట్రావు, తాతామధు. పినపాక నియోజకవర్గానికి తెల్లం వెంకట్రావు, దిండిగాల రాజేందర్. భద్రాచలం నియోజకవర్గానికి కోరం కనకయ్య, తుళ్లూరి బ్రహ్మయ్యలను అబ్జర్వర్లుగా నియమించారు.



Next Story