కొత్త రేషను కార్డులపై సర్క్యులర్.. వచ్చేది అప్పుడే..!

by  |
New ration cards
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త రేషను కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ లోగా పూర్తికావాలని కమిషనర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకోసం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మొదలు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వరకు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేశారు. సుమారు 4.97 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉన్నందున అర్హత విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కొత్త రేషను కార్డులకు మాత్రమే పరిమితం కావాలని, పాత కార్డుల్లో పేర్ల మార్పులు చేర్పులను చేపట్టవద్దని స్పష్టం చేశారు.

దరఖాస్తులను ఐటీ శాఖ ‘360 డిగ్రీ’ విధానంలో పరిశీలించి అర్హత లేనివాటిని పక్కన పెట్టాలని ఆదేశించారు. ఇలా రూపొందిన జాబితాను రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు సాఫ్ట్ కాపీ రూపంలో లాగిన్ ఉన్నవారికి మాత్రమే పంపించాలని తెలిపారు. దానికి అనుగుణంగా వారు క్రింది స్థాయిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించి క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హతను ధృవీకరించుకోవాలని వివరించారు.

రెండో దశలో, రేషను కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విధిగా వారి పేరు, వివరాలను పేర్కొంటూ స్టాంపు వేయాలని వివరించారు. ఆ దరఖాస్తుపై వారి రిమార్కులను కూడా నమోదు చేయాలని, అర్హతకు అనువైనవిగా భావించినట్లయితే వాటిని తాహసీల్దారుకు, సహాయ పౌర సరఫరాల శాఖ అధికారులకు పంపాలని పేర్కొన్నారు. మూడో దశలో వీటిని సమీపంలోని రేషను దుకాణాలకు అనుసంధానం చేయడంతో పాటు వార్షిక ఆదాయం, వంట గ్యాస్ వివరాలను నమోదు చేయాలని, జిల్లా సివిల్ సప్లయ్ అధికారికి సిఫారసు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేని దరఖాస్తులను ఆమోదించవద్దని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed