ఇదేం న్యాయం.. కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగుల కొత్త డిమాండ్..

by  |
ఇదేం న్యాయం.. కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగుల కొత్త డిమాండ్..
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 ఏళ్ళకు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని మాకూ కల్పించాలని 2018 డిసెంబరు నుంచి 2021 ఫిబ్రవరి మధ్య రిటైర్టు అయిన ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లకు వయో పరిమితి పెంచుతామని మేనిఫెస్టో ప్రవేశపెట్టగా.. టీఆర్ఎస్ పార్టీ 61 ఏళ్లకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రెండో దఫా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2018 డిసెంబరు నుంచి వయో పరిమితి ఉత్తర్వులు పరిగణనలోకి రాని 2021 ఫిబ్రవరి వరకూ రిటైర్డు అయిన ఉద్యోగులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితం అవుతున్నారు.

వాస్తవానికి 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించగా, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఉద్యోగలు వయో పరిమితి పెంచుతారేమోనని ఎదురు చూశారు. కానీ, 2018 డిసెంబరు నుంచి పలు సందర్భాలలో వయో పరిమితి పెంచుతారేమోనని ఉద్యోగులు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. కేసీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన 2018 డిసెంబరు నుంచి 2021 ఫిబ్రవరి వరకూ రాష్ట్రంలో సుమారు 15 వేల నుంచి 18 వేల మంది ఉద్యోగులు రిటైర్డు అయినట్టు అంచనా.

సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2018 డిసెంబరు నుంచే వయో పరిమితి పెంచితే ఉద్యోగ విరమణ 58 ఏళ్లకే కాకుండా, 61 సంవత్సరాల వరకూ (మరో మూడేళ్లు) ఉద్యోగంలో కొనసాగవచ్చని ఆశపడ్డారు. ఈ విషయం అనేక సార్లు వాయిదా పడుతూ.. 2021 మార్చి 22న అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఈ వయో పరిమితి ప్రకటనను ఏ ప్రాతిపదిన ప్రకటించారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను రిటైర్డు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా, ఈ ఆదేశాలు ప్రకటించిన 2021 మార్చి 22 నుంచే అమల్లోకి వస్తాయని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడంతో.. 2021 పిబ్రవరి వరకూ రాష్ట్రంలో రిటైర్డు అయిన ఉద్యోగుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్టు అయ్యింది. దీంతో వీరంతా రాష్ట్రంలో మరో ఉద్యమానికి సన్నద్దం అవుతున్నారు. అంతే కాకుండా, గతేడాది 2020లో ప్రతి ఉద్యోగి కరోనా కట్టడిలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్ గా ముందుండి విధులు చేపట్టిన విషయం గుర్తుకు రాలేదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 2020 కోవిడ్ సమయంలో, ప్రస్తుతం రిటైర్డు అయిన ఉద్యోగులు విధుల నిర్వహణలో అనేక ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొన్నట్టు వాపోతున్నారు.

2018 ఎన్నికల్లో వయో పరిమితి అంశం మేనిఫేస్టోలో ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీకి ఉద్యోగులంతా అండగా ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, సకల జనుల సమ్మె, మిలీనియం మార్చ్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రెండు మార్లు అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అంటున్నారు. అందులో ఈ మూడేళ్ల కాలంలో రిటైర్డు అయిన ఉద్యోగులు కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2018 డిసెంబరు నుంచి అసెంబ్లీలో వయో పరిమితి పెంచుతున్నట్టు ప్రకటించిన (మార్చిలో ప్రకటన) నాటికి 2021 ఫిబ్రవరి నెలలో రిటైర్డు ఉద్యోగులు అందరికీ వయో పరిమితి జీవోను అమలు చేయాలని రిటైర్డు అడిషనల్ ఎస్పీ పరమాల నర్సింహులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, మానిటరీ బెనిఫిట్స్ సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. లేదంటే, రాష్ట్రంలో రిటైర్డు ఉద్యోగులంతా ఒక వేదికపైకి వచ్చేందుకు త్వరలోనే సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసి, మరో ఉద్యమానికి సిద్దం అవుతున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed