రేషన్‌లో నయా దందాకు తెర

by  |
రేషన్‌లో నయా దందాకు తెర
X

దిశ, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఇటీవల అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు నయా దందాకు తెరలేపారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం కార్డుదారులకు రావాల్సిన దానికంటే సగం మాత్రమే ఇస్తూ మిగతా సగాన్ని అక్రమార్కులకు అమ్ముకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రేషన్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు తమ మిల్లులకు అక్రమార్కుల ద్వారా తరలించుకొని వాటినే సన్నబియ్యంగా మార్చి సాంబమసూరి బియ్యంగా చెబుతూ ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అర్ధరాత్రి సమయంలో కొన్ని వాహనాల ద్వారా అక్రమ రవాణా చేస్తూ ఇతర రాష్ట్రా కు తరలిస్తున్నారు. ఈ రవాణాకు జిల్లాలో కొంత మంది పోలీసు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే దందాలో ఆరితేరిన పెన్ పహాడ్ మండలానికి చెందిన ఓ అక్రమ బియ్యం వ్యాపారి ఇప్పటికి పెద్ద ఎత్తున దందాలు చేస్తూ పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు అప్పజెపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇతను పోలీస్ డిపార్ట్ మెంట్లో పలువురు అధికారులను పరిచయం చేసుకుని దందాను మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించించినట్లు వినికిడి. ఎంతో మందిని పట్టుకున్న పోలీసులు ఇతనిని మాత్రం నేటికి పట్టుకోలేదంటే ఏ మర్మం ఉందో ఇట్టే తెలిసి పోతుంది. ఇతనే కాక సూర్యాపేటలో ఓ కిరాణా దుకాణ వ్యాపారి, మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు, చివ్వేంల మండలంలో తండాలో ఓ ఇద్దరు వ్యాపారులు, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ రెండు వార్డులలో ఆరితేరిన వ్యాపారులు నేటికి ఇదే వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.

జిల్లాలో అధికంగా తాండలలో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. మెల్లచేరువు, మట్టంపల్లి, అనంతగిరి, కోదాడ, నాగరాం,తిరుమల గిరి మండలాల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో అధికంగా వ్యాపారం చేస్తూ ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీస్, ఇతర శాఖల అధికారులను మచ్చిక చేసుకొని విపరీతంగా వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

అధికంగా జిల్లా కేంద్రంలోని డీలర్లే

ఈ రేషన్ దందాలో జిల్లాలోని పలు తండాలకు చెందిన డీలర్లతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు డీలర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరు అక్రమార్కుల అండతో కార్డు దారులకు సగం సన్న బియ్యం మాత్రమే ఇస్తూ దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడం విశేషం.

కోళ్ల దానకు కూడా..

ఈ బియ్యాన్ని అక్రమార్కులు పలు రకాలుగా వాడుతున్నారు. మిల్లర్లకు తరలించి సన్నబియ్యంగా మార్చి అధిక ధరలకు అమ్ముకోవడమే గాక ఇతర రాష్టలకు తరలించడంతో పాటు నూకగా మార్చి కోళ్లఫారాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు గీసుకోవడమే గాక, కార్డు దారులకు సగం బియ్యం ఇస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed