బస్ పాస్ లకు కొత్త కండీషన్స్.. ఆదేశాలు జారీ చేసిన టీఎస్ఆర్టీసీ

by  |
bus-pass
X

దిశ, సిటీ బ్యూరో : వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు రీ ఓపెన్ అవుతున్నందున సర్కారు ఆదేశాల మేరకు విద్యార్థులకు బస్ పాస్ లను అందించేందుకు ఆర్టీసీ కూడా సిద్దమవుతోంది. ఇందుకు గాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో 40 బస్ పాస్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకే గాక, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు కూడా బస్ పాస్ లను జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు విద్యార్థులు ఈ నెల 30వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

rtc

టీఎస్ఆర్టీసీ చెందిన అధికారిక వెబ్ సైట్ online.tsrtcpass.in కు ఆన్ లైన్ లో దరఖాస్తును సమర్పించి, వచ్చే నెల 2వ తేదీ నుంచి ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల 15 నిమషాల వరకు బస్ పాస్ కౌంటర్ల నుంచి పాస్ లను పొందవచ్చునని సూచించారు. ఏడవ తరగతి వరకు చదివే విద్యార్థులు, 18 ఏళ్ల లోపు వయస్సు, లేదా 10 తరగతి చదువుతున్న బాలికలు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారం ను డౌన్ లోడ్ చేసుకుని, లేదా దగ్గర్లో ఉన్న బస్ పాస్ కౌంటర్ నుంచి నేరుగా తీసుకుని, దాన్ని పూరించి పాఠశాల హెడ్ మాస్టర్ సంతకం చేయించి, సీల్ వేయించుకుని దగ్గర్లో ఉన్న బస్ పాస్ కౌంటర్ లో సమర్పించి ఉచిత బస్ పాస్ ను పొందవచ్చునని తెలిపారు. విద్యార్థులను బస్ పాస్ లకు ధృవీకరించే ముందు కళాశాలలు ముందుగా కోర్సుల వివరాలను, అవసరమైన పత్రాలను టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ కార్యాలయం, రెండవ అంతస్తు, రేతిఫైల్ బస్ స్టేషన్ సికిందరాబాద్ లో అందజేసి, అడ్మినిస్ట్రేటీవ్ ఛార్జీలను చెల్లించి నమోదు చేయించుకోవటం ద్వారా కళాశాలలకు కొత్త యూజర్ ఐడీనీ, పాస్ వార్డును పొందవచ్చునని ఆయన సూచించారు.

బస్ పాస్ కౌంటర్లున్న ప్రాంతాలు
బస్ పాస్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు ఈ కింద పేర్కొన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్ పాస్ కౌంటర్ల నుంచి తమ బస్ పాస్ లను వచ్చే నెల 2వ తేదీ నుంచి తీసుకోవచ్చునని వెంకటేశ్వర్లు తెలిపారు. అబిడ్స్, అప్జల్ గంజ్, ఆరాంఘర్, బాలానగర్, సీబీఎస్, చార్మినార్, దిల్ సుఖ్ నగర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఫారుఖ్ నగర్, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు, ఘట్ కేసర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, జెబీఎస్, కాచిగూడ, కోఠి టెర్మినల్, కేపీహెచ్ బీ, కూకట్ పల్లి బస్ స్టేషన్, ఎల్బీనగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహిదీపట్నం, మిధానీ, మోయినాబాద్, ఎన్ జీఓ కాలనీ, పటాన్ చెరు, రేతిఫైల్ బస్ స్టేషన్ సికిందరాబాద్, రిసాలాబజార్, సనత్ నగర్, శంషాబాద్, ఎస్ ఆర్ నగర్, షాపూర్ నగర్, సుచిత్ర, తార్నాక, తుక్కుగూడ, ఉప్పల్, ఉప్పల్ క్రాస్ రోడ్, వనస్థలిపురం, ఉమెన్స్ కాలేజీ కోఠి ప్రాంతాల్లో బస్ పాస్ కౌంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.



Next Story

Most Viewed