ఆఖరి నిమిషంలో గోల్.. మ్యాచ్ డ్రా!

by  |
ఆఖరి నిమిషంలో గోల్.. మ్యాచ్ డ్రా!
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 2020-21 సీజన్‌లో భాగంగా గురువారం గోవాలోని జీఎంసీ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. చివరి వరకు కేరళ బ్లాస్టర్స్ క్లబ్ ఆధిపత్యం ప్రదర్శించి గెలిచే పరిస్థితి వచ్చినా.. ఆఖరి నిమిషంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్ గోల్ చేసి స్కోర్లు సమం చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే కేరళ బ్లాస్టర్స్ దూకుడు ప్రదర్శించింది.

సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందిన కేరళ బ్లాస్టర్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలను కనబర్చింది. మ్యాచ్ ఆరంభమైన 5వ నిమిషంలోనే కేరళ ఆటగాడు సిడొంచా హెడర్‌తో బంతికి గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో కేరళకు 1-0 ఆధిక్యం లభించింది. తొలి అర్థభాగం ముగిసే ముందు కేరళకు పెనాల్టీ లభించింది. గారీ హూపర్ బంతిని ఎలాంటి తడబాటు లేకుండా గోల్‌పోస్టులోకి కొట్టాడు. దీంతో కేరళకు 2-0 తేడాతో తిరుగులేని ఆధిపత్యం లభించింది.

రెండో అర్థభాగంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ బంతిని తమ దాదాపు నియంత్రణలోనే ఉంచుకున్నది. రెండో అర్థభాగం ప్రారంభమైన ఆరోనిమిషంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఆటగాడు క్వేసీ అప్పయ్య గోల్ చేశాడు. దీంతో కేరళ ఆధిక్యంత 2-1కి తగ్గింది. ఆ తర్వాత నార్త్ఈస్ట్ యునైటెడ్ పలుమార్లు గోల్ చేయడానికి ప్రయత్నించినా కేరళ బ్లాస్టర్స్ డిఫెండర్లు బంతిని సమర్దవంతంగా అడ్డుకున్నారు. 65వ నిమిషంలో నార్త్ఈస్ట్‌కు పెనాల్టీ లభించినా.. దాన్ని గోల్‌గా మల్చడంలో అప్పయ్య విఫలమయ్యాడు.

ఇక మ్యాచ్ చివరి వరకు ఇరుజట్లు గోల్ కోసం హోరాహోరీగా పోరాడాయి. కేరళ బ్లాస్టర్స్ గెలుపు దాదాపు ఖాయం అనుకుంటుండగా 90వ నిమిషంలో నార్త్ఈస్ట్ ఆటగాడు ఇద్రిసా సైలా అనూహ్యంగా గోల్ చేశాడు. లాంగ్ పాస్‌ను గోల్‌గా మల్చడంతో 2-2తో స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత 5 నిమిషాల ఇంజ్యురీ టైం అదనంగా కలిపినా ఇరుజట్లు స్కోర్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. క్లబ్ అవార్డును ఇరు జట్లకు సమంగా పంచగా.. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు సత్యసేన్ సింగ్‌కు, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డైలాన్ ఫాక్స్‌కు లభించింది.



Next Story

Most Viewed