అంచనాలకు మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by  |
అంచనాలకు మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలకు మించి నమోదైనట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 9.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బడ్జెట్‌లో సవరించిన అంచనాల కంటే ఇది 5 శాతం అధికంగా ఉన్నట్టు సీబీడీటీ ప్రకటించింది. అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో వసూలైన ప్రత్యక్ష పన్ను వసూళ్ల కంటే 10 శాతం తక్కువగా ఉన్నట్టు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింది. రీఫండ్ చెల్లింపులు రూ. 2.61 లక్షల కోట్లు 2019-20లో వసూలైన రూ. 1.83 లక్షల కోట్ల కంటే 42.1 శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మొత్తం పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్నుల వాటా రూ. 4.57 లక్షల కోట్లుగా ఉండగా, రూ.16,927 కోట్ల సెక్యూరిటీ ట్రాన్సాక్షన్​ ట్యాక్స్​ (ఎస్​టీటీ)తో కలిపి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ. 4.88 లక్షల కోట్లుగా నమోదైనట్టు వివరించింది. రీఫండ్‌లను చెల్లించకమునుపు మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 12.6 లక్షల కోట్లు. కరోనా మహమ్మారి పరిణామాలు, గత ఆర్థిక సంవత్సరంలో రీఫండ్‌లలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ సవరించిన అంచనాలను మించి పన్ను వసూళ్లు నమోదయ్యాయని సీబీడీటీ ఛైర్మన్ పీసీ మోదీ చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించేందుకు వివిధ చర్యలు తీసుకున్నామని, గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన పన్ను వసూళ్లే దీనికి సాక్ష్యమని పీసీ మోదీ తెలిపారు. ఈ గణాంకాలను బట్టి 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని సీబీడీటీ అంచనా వేసింది.



Next Story