మేడారం జాతర పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

by  |
మేడారం జాతర పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
X

దిశ, ములుగు: ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అంచనాతో ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో నాసిరకంగా చేపట్టడం గమనార్హం.

మేడారం జాతర(2022 ఫిబ్రవరి 16 నుండి 19 వరకు) కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వంద కోట్లు మంజూరు చేసినప్పటికీ, భక్తుల సౌకర్యార్థం చేయవలసిన అభివృద్ధి పనులు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. జాతర దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా అభివృద్ధి పనులు మొదలు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భక్తులకు వసతుల కల్పన, జంపన్న వాగు వద్ద స్నానాలకు కావాల్సిన స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, భక్తుల వసతికి సంబంధించిన పనులపై.. మంత్రి సత్యవతి, కలెక్టర్ ఉన్నతాధికారులతో నిర్వహించిన పనుల్లో పురోగతి కనిపించడం లేదు.

గుంతల మయంగా రహదారులు

మేడారం జాతరకు వెళ్లే ప్రధాన రహదారి సైతం గుంతలమయంగా మారింది. పస్ర నుండి నార్లాపూర్ మీదుగా సుమారు 17 కిలోమీటర్ల రహదారి గతంలో ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతింది. గత సంవత్సర కాలం నుండి మరమ్మతు చేయకుండా గాలికి వదిలేసిన వైనం స్పష్టమౌతుంది. మేడారం జాతర దగ్గర పడడంతో హుటాహుటిన పనులు మొదలు పెట్టినప్పటికీ, దీనివల్ల నాణ్యత లోపించడంతో మళ్లీ తొందర్లోనే రహదారులు గుంతలు పడతాయని వాహనదారులు అంటున్నారు.

ముందస్తు భక్తులకు తప్పని తిప్పలు

మేడారం జాతర సమయంలోనే కాకుండా నిత్యం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తులు మేడారానికి వస్తూనే ఉన్నారు. వారాంతపు సెలవులు ఉండటంతో శని ఆదివారాలలో భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఇలా వచ్చిన భక్తులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పరిమిత సంఖ్యలో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి సౌకర్యం ఉండటంతో భక్తులు జాతర పనులపై పెదవి విరుస్తున్నారు. జాతర దగ్గర పడటంతో హుటాహుటిన నిర్మాణాలు చేపట్టే కంటే ముందస్తుగా సౌకర్యాలు కల్పించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed