బ‌స్టాండ్ మారేదెప్పుడు..? ఎమ్మెల్యే సార్ జర చూడరా..

by  |
బ‌స్టాండ్ మారేదెప్పుడు..? ఎమ్మెల్యే సార్ జర చూడరా..
X

దిశ, మ‌హ‌బూబాబాద్ టౌన్ : మ‌హ‌బూబాబాద్‌ పంచాయ‌తీ స్థాయి నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగింది. జ‌నాభా వేల నుంచి ల‌క్ష‌ల‌కు చేరుకుంటోంది. నిత్యం ప‌ట్టణం మీదుగా ఆర్టీసీ బ‌స్సుల ద్వారా ప్ర‌యాణించే వారి సంఖ్య‌10 వేల‌కు పైగానే ఉంటోంది. అయితే ఆర్టీసీ బ‌స్ స్టేష‌న్ మాత్రం అధ్వానంగా మారుతోంది. ఇప్ప‌టికి బ‌స్‌స్టేష‌న్ అభివృద్ధి క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వానొస్తే చెరువును త‌ల‌పిస్తోంది. జిల్లా కేంద్రం బ‌స్‌స్టేష‌న్ అంటే న‌మ్మ‌శ‌క్యంగా లేని విధంగా ద‌ర్శ‌మిస్తోంది. ప‌రిమిత‌మైన సంఖ్య‌లో ఫ్లాట్‌ఫామ్స్ ఉండగా, వ‌ర్ష‌కాల‌మంతా కూడా ఎప్పుడు బుర‌దతో క‌నిపిస్తోంది. బ‌స్‌స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల అవ‌స్థ‌లు అన్ని ఇన్ని కావు. బుర‌ద‌లోంచే న‌డుస్తూ వ‌చ్చి జారిప‌డుతున్న సంఘ‌ట‌న‌లున్నాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు భ‌ద్రాచ‌లం బ‌స్సు ఎక్కేందుకు కాసింత వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ బుర‌ద‌లో జారిప‌డ‌టంతో త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు.

ఎమ్మెల్యే సార్‌.. బ‌స్టాండ్ సంగ‌తి జ‌ర చూడండి..

మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంగా అవ‌త‌రించ‌డంతో బ‌స్టాండ్ రూపురేఖ‌లు మారుతాయ‌ని ఆశించారు. బ‌స్టాండ్ ఆవ‌ర‌ణ‌లో సీసీ నిర్మాణం చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చార‌ని స్థానిక ప్ర‌జ‌లు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒరిగిందేమీ లేదు. గ‌తంలో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ బ‌స్‌స్టేష‌న్ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఎంత నిర్ల‌క్ష్య‌మ‌య్యాయో బ‌స్‌స్టేష‌న్‌లోని బుర‌దే సాక్ష్యంగా నిలుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ర‌వాణాశాఖ మంత్రి అజ‌య్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్ళి బ‌స్ స్టేష‌న్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాల‌ని ఎమ్మెల్యేను ప్ర‌జ‌లు కోరుతున్నారు. లేదంటే క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎమ్మెల్యేకు కేటాయించే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధ‌ుల‌తోనైనా బ‌స్ స్టేష‌న్ ప్రాంగ‌ణంలో సీపీ నిర్మాణం చేప‌ట్టాల‌ని మానుకోట ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.


Next Story