ప్రారంభంకాని కొనుగోళ్లు.. అయోమయంలో అన్నదాతలు

by  |
ప్రారంభంకాని కొనుగోళ్లు.. అయోమయంలో అన్నదాతలు
X

దిశ, భూపాలపల్లి: రైతు పండించిన వరి పంట కల్లాలకు చేరింది. పంట అమ్ముదాం అనుకున్నా రైతుకు కన్నీరే మిగిలింది. కల్లాలలో పంట నీటి పాలు కావడంతో అన్నదాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక వైపు ప్రకృతి వైపరీత్యం వల్ల అన్నదాత నిండమునిగిపోగా, మరోవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అన్నదాత కోలుకోని పరిస్థితి ఏర్పడింది. పండించిన పంటను కొనేవారు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. జిల్లాలో 165 వరి ధాన్యపు కేంద్రాలను ప్రారంభించవలసిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 18 కేంద్రాలు మాత్రమే ప్రారంభించింది. కల్లాల్లో వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా చేరి ఉన్నాయి. కొనేవారు లేక రాత్రి పగలు వరి ధాన్యాన్ని కాపాడుకుంటూ రైతులు కల్లాల వద్ద ఉంటున్నారు. అసలు ప్రభుత్వం ధాన్యాన్ని కొంటుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితిలో రైతాంగం ఉంది. ఒకవైపు ప్రభుత్వము అధికారులు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని పత్రికా ప్రకటనలు, హామీలు ఇస్తున్నారు తప్ప అది అమలు కావడం లేదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో 18 వేల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ మేనేజర్ తెలిపారు. గత నెల రోజుల నుండి వరి ధాన్యం కల్లాలలో పోసిన రైతులు, ప్రభుత్వం దాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తుందా అని కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సింగిల్ విండో ద్వారా కొనాల్సిన వరి ధాన్యం ఇంత వరకు అధికారులు కొనుగోలు చేయడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో వరి ధాన్యం కొనుగోలు చేయాలని లేదా అనేది సింగిల్ విండో వారికి అర్థం కావడం లేదు.

కోతలతో రైతుల గుండెకోత..

ధాన్యం కాంటాలు వేసే సమయంలో మిల్లర్లు విధించే కోత రైతులకు కడుపుకోత‌గా మిగులుతుంది. ప్రతి క్వింటాలకు 6 నుంచి 9 కిలోల వరకూ రైతుల నుండి పేరుతో కోత విధిస్తున్నారు. దీంతో ప్రతి రైతు సుమారుగా క్వింటాలుకు 200 రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వము ధాన్యం కొనుగోలు చేయడం లేదని కల్లాల వద్ద రైతులు హడవిడిగా కాంట పెట్టించుకోగా, రైతుల అవసరాలను ఆసరాగా తీసుకున్న మిల్లర్లు తమకు ఇష్టమైన రీతిలో కోతలు విధిస్తున్నారు. గత సంవత్సరం ధాన్యం‌లో ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు నష్టం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు మిల్లర్లు విధించే కోతకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు అంటున్నారు. మిల్లర్ల దోపిడి అరికట్టండి. కల్లాల వద్ద మిల్లర్లుదోచుకునే విధానాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్వింటాలుకు 6 నుంచి 9 కిలోలు తరుగు పేరుతో రైతుల నుండి దోచుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు మిల్లర్లులాభం పడుతున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతులకు అదనంగా హమాలీల చార్జీలు

ఒకవైపు మిల్లర్లుదోచుకోవడమే కాకుండా మరో వైపు హమాలీలకు చెల్లించే చార్జీలు సైతం రైతులే భరించాల్సి వస్తుంది. క్వింటాలుకు 43 రూపాయల హమాలీ చార్జీలు గత రెండు సంవత్సరాలుగా రైతులు భరిస్తున్నారు. హమాలీలకు చెల్లించే చార్జీలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా అది మాత్రం ఇంతవరకు ఇవ్వడం లేదని దేవరపల్లికి చెందిన గుడిపాటి రమేష్ రెడ్డి అనే రైతు వాపోయారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా దోచుకుంటున్నారని ఈ ప్రాంత రైతన్న వాపోతుంది.

Next Story

Most Viewed