తెలంగాణలో మరో నెక్లెస్‌ రోడ్డు మెరిసే..

by  |
తెలంగాణలో మరో నెక్లెస్‌ రోడ్డు మెరిసే..
X

దిశ, సిద్దిపేట : తెలంగాణలో మరో నెక్లెస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుంది. విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతున్న ఈ నెక్లెస్ రోడ్డు ప్రారంభానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈనెల 8వ తేదీన కోమటి చెరువు- నెక్లెస్ రోడ్డును ప్రారంభించనున్న నేపథ్యంలో సుందరీకరణ పనులను మంగళవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ముందుగా గ్లో గార్డెన్స్ సుందరీకరణ, నెక్లెస్ రోడ్ అభివృద్ధి పనులు, గ్లో గార్డెన్స్‌లో పలు రకాలైన విద్యుత్ కాంతులు విరజిమ్మే అంశాలపై టూరిజం ఏండీ మనోహర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

మూడు రీచ్‌లుగా చేపట్టిన నెక్లెస్ రోడ్డు సుందరీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు, పలు అసంపూర్తి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టరును మంత్రి ఆదేశించారు. నెక్లెస్ రోడ్డుపై కలియ తిరుగుతూ.. రెయిలింగ్, అర్చ్, లైటింగ్, ఫుట్ పాత్, కూర్చునే కుర్చీ బల్లలు, లైటింగ్- విద్యుత్తు దీప కాంతులతో మెరిసిపోతున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లపై తిరుగుతూ.. సుందరీకరణపై ఆరా తీశారు. కార్యక్రమంలో మంత్రి వెంట టూరిజం ఏండీ మనోహర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఈఈ వీర ప్రతాప్, ఏఈ మహేశ్, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed