దేశవ్యాప్తంగా కోల్‌మైన్స్ వనమహోత్సవ్‌ కార్యక్రమం

by  |
దేశవ్యాప్తంగా కోల్‌మైన్స్ వనమహోత్సవ్‌ కార్యక్రమం
X

దిశ, కొత్తగూడెం: దేశంలోని బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది వన మహోత్సవ్‌ కార్యక్రమం పేరుతో పెద్దఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇందులో సింగరేణి సంస్థ 35 లక్షల మొక్కలు నాటనుందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. బుధవారం (జులై 15) న్యూఢిల్లీ నుంచి కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ దేశంలోని కోలిండియా సింగరేణి తదితర బొగ్గు లిగ్నైట్‌ కంపెనీ ఛైర్మన్‌ మరియు ఎండీలతో వనమహోత్సవ్‌ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పాల్గొన్నారు.
వనమహోత్సవ్‌ ఈ నెల 23వ తేదీన ఒకేసారిగా సింగరేణి వ్యాప్తంగా 15 ప్రదేశాల్లో వన మహోత్సవ్‌ (హరితహారం)’’ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని, ఇందులో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారని వివరించారు.

ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేస్తామని సీఎండీ స్పష్టంచేశారు. సింగరేణిలో ఇప్పటి వరకూ 12,172 హెక్టార్లలో 5 కోట్ల 25 లక్షల మొక్కలు నాటామని, వీటిలో 75 శాతం మొక్కలు పాదుకొని పెరుగుతున్నాయన్నారు. దీనిపై కేంద్ర ప్రత్యేక కార్యదర్శి సంతోషం ప్రకటిస్తూ సింగరేణి సంస్థ తీసుకుంటున్న పర్యావరణహిత చర్యలను ప్రశంసించారు.

వీడియో కాన్ఫరెన్సులో సింగరేణి నుంచి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌‌తో పాటు అడ్వయిజర్‌ (ఫారెస్ట్రీ) కె.సురేంద్ర పాండే, డైరెక్టర్‌ (పీఅండ్‌పీ) బి.భాస్కర్‌ రావు (బెల్లంపల్లి నుంచి), జనరల్‌ మేనేజర్‌ కో-ఆర్డినేషన్‌ కె.రవిశంకర్‌ పాల్గొన్నారు. కలకత్తా నుంచి కోలిండియా సీఎండీ ప్రమోద్‌ అగర్వాల్‌‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కోల్‌ సబ్సిడరీ ఛైర్మన్‌‌లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed