భారత్‌లో కొత్తగా 14 లక్షల కేన్సర్ కేసులు

by Dishanational1 |
భారత్‌లో కొత్తగా 14 లక్షల కేన్సర్ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కేన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. 2022కి సంబంధించిన గణాంకాలను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ, ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా మొత్తం 14 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. అలాగే, కేన్సర్ కారణంగా 9.1 లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోయినట్టు పేర్కొంది. మొత్తం కేసుల్లో అత్యధికంగా 1.92 లక్షల రొమ్ము కేన్సర్ కేసులు నమోదయ్యాయి. పెదవి,నోటి కేన్సర్ కేసులు, ఊపిరితిత్తుల కేన్సర్లు పురుషులలో సర్వసాధారణంగా మారాయని, కొత్త కేసులలో అవి వరుసగా 15.6 శాతం, 8.5 శాతంగా ఉన్నాయని గణాంకాలు పేర్కొన్నాయి. అయితే రొమ్ము, గర్భాశయ కేన్సర్లు మహిళల్లో చాలా తరచుగా సంభవిస్తున్నాయి. రొమ్ము కేన్సర్ కేసులు దాదాపు 27 శాతం వరకు ఉండగా, గర్భాశయ కేన్సర్ కేసులు 18 శాతంగా నమోదయ్యాయి. అధిక శాతం మరణాలకు ఈ కేన్సర్ రకాలే కారణమని డబ్ల్యూహెచ్ఓకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ కేన్సర్(ఐఏఆర్‌సీ) అభిప్రాయపడింది. కేన్సర్ నిర్ధారణ అయిన తర్వాత 5 సంవత్సరాలలోపు జీవించి ఉన్న వారి సంఖ్య భారత్‌లో దాదాపు 32.6 లక్షలుగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కూడా 2 కోట్ల కొత్త కేన్సర్ కేసులు, 97 లక్షల మరణాలను ఐఏఆర్‌సీ అంచనా వేసింది. కేన్సర్ నిర్ధారణ తర్వాత 5 సంవత్సరాలలో 5.3 కోట్ల మంది ప్రజలు జీవించి ఉన్నారు. ప్రతి 5 మందిలో ఒకరు వారి జీవితకాలంలో కేన్సర్ బారిన పడుతున్నారు. 9 మంది పురుషులలో ఒకరు, ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. దేశంలో 75 ఏళ్లలోపు ఉన్నవారిలో కేన్సర్ బారిన పడే అవకాశం 10.6 శాతంగా ఉనని, మరణించే ప్రమాదం 7.2 శాతంగా ఉందని ఐఏఆర్‌సీ అంచనా వేసింది. ఇది ప్రపంచంలో వరుసగా 20 శాతం, 9.6 శాతంగా ఉన్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల కొత్త కేసులకు, మరణాలకు ప్రధానమైన 10 రకాల కేన్సర్‌లే కారణం. అందులో ఊపిరితిత్తుల కేన్సర్లు 25 లక్షలు(12.4 శాతం)తో అత్యధికంగా ఉన్నాయి. మరణాల్లో కూడా 18 లక్షల(19 శాతం)తో అత్యధికంగా ఉన్నాయి. దీని తర్వాత రొమ్ము కేన్సర్(23 లక్షలు, 11.6 శతం) రకం ఉంది. గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ అత్యంత సాధారణంగా సంభవించే క్యాన్సర్‌గా, మరణానికి ఈ రకం కేన్సర్ తొమ్మిదవ ప్రధాన కారణమని వారి గణాంకాలు చెబుతున్నాయి.


Next Story

Most Viewed