ఆప్‌ను గెలిపిస్తే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు : కేజ్రీవాల్

by Hajipasha |
ఆప్‌ను గెలిపిస్తే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు : కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ గ్యారంటీలు కావాలా ? కేజ్రీవాల్‌ గ్యారంటీలు కావాలా ? తేల్చుకోవాలని దేశ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరుతో 10 ఎన్నికల హామీలను ఆయన ప్రకటించారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం వేదికగా హామీల వివరాలను కేజ్రీవాల్ వెల్లడించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చైనా ఆక్రమణలో ఉన్న భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేయడంతో పాటు అగ్నివీర్లకు శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌ను కేటాయిస్తామని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధరను కల్పించనున్నట్లు కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు.

రూ. 1.25 ల‌క్ష‌ల కోట్లతో ఏటా ఉచిత విద్యుత్

దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యంతోపాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. 24 గంటల విద్యుత్ సరఫరా ఆప్ పాలిత రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్‌లలో సాధ్యమైనప్పుడు.. దేశవ్యాప్తంగానూ అమలు చేయవచ్చన్నారు. ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు వంటి గ్యారంటీలను సైతం ఢిల్లీలో ఇప్పటికే అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇండియా కూటమి గెలిచాక దేశంలోని పేద‌లంద‌రికీ ప్రతినెలా 200 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్‌ను అందజేస్తామన్న కేజ్రీవాల్.. అందుకోసం రూ. 1.25 ల‌క్ష‌ల కోట్ల వ్య‌యం అవుతుందని చెప్పారు. ఆ నిధుల‌ను తాము ఏర్పాటు చేయగలమన్నారు.

మీరు ఆప్‌ను గెలిపిస్తే.. నేను జైలుకెళ్లాల్సిన అవసరం ఉండదు

‘‘కేజ్రీవాల్‌ గ్యారంటీ అంటే మార్కెట్లో ఒక బ్రాండ్‌. మేం ఒక మాట చెబితే పూర్తి చేసి చూపుతాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు రూ. 5 లక్షల కోట్లు అవసరమవుతాయి. ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చు చేయగలవు. ఇక దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రూ. 5 లక్షల కోట్లు కావాలి. ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి బాగాలేదు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రాంతంలోనూ మొహల్లా క్లినిక్‌లను తెరుస్తాం. జిల్లా ఆస్పత్రులను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారుస్తాం’’ అని ఆప్ చీఫ్ వివరించారు. పీఎంఎల్‌ఏ చట్టం పరిధి నుంచి జీఎస్టీని తొలగించేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తానన్నారు. అయితే తాము ప్రకటించిన గ్యారంటీలపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చించలేదన్న కేజ్రీవాల్‌, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుచేసేందుకు ఒత్తిడి చేస్తామన్నారు. తన అరెస్టు తర్వాతే ఆప్ మరింత బలపడిందని కేజ్రీవాల్ అన్నారు. తాను జైల్లో ఉన్న టైంలో కూడా ఆప్‌ను విచ్ఛిన్నం చేయడంలో బీజేపీ విఫలమైందని పేర్కొన్నారు. ‘‘నేను 20 రోజుల తర్వాత తిహార్ జైలుకు తిరిగి వెళ్లాలి. మీరు చీపురు గుర్తుకు ఓటువేసి ఆమ్ ఆద్మీ పార్టీని బంపర్ మెజారిటీతో అన్ని సీట్లలో గెలిపిస్తే.. నేను ఇక జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’’ అని ఆయన ప్రజలను కోరారు.



Next Story

Most Viewed