బిగ్ బ్రేకింగ్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్
X

దిశ, వెబ్‌డెస్క్: చారిత్మ్రాక మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 454 మంది ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపగా.. ఇద్దరు ఎంఐఎం ఎంపీలు ఆమోదం తెలపలేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మెజార్టీ సభ్యులు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లోక్ సభలో మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 454 మంది ఎంపీలు మద్దతు తెలపడంతో లోక్ సభలో ఆమోదం లభించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్ సభలో చర్చ జరిగింది. దాదాపు 8 గంటలపాటు ఈ బిల్లుపై సభలో డిస్కషన్స్ జరగగా.. దాదాపు 60 మంది ఎంపీలు మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీలు తమ స్టాండ్‌ను వెల్లడించాయి. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శించగా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో సమాధానమిచ్చారు. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ జరిగింది.

Next Story

Most Viewed