దారుణం.. ఘోరం.. మహిళను చంపి అవయవాలు పీక్కుతిన్న వీధి కుక్కలు

by Dishanational4 |
దారుణం.. ఘోరం.. మహిళను చంపి అవయవాలు పీక్కుతిన్న వీధి కుక్కలు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే చాలు.. వారిపై దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో బాధితులు చనిపోతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఒకేసారి 20 కుక్కలు ఆమెపై దాడి చేయడంతో.. మహిళ ఏమీ చేయలేకపోయింది. మహిళపై పడి దారుణంగా పీక్కుతిన్న కుక్కలు చనిపోయే వరకు వదల్లేదు. చనిపోయిన తర్వాత కూడా అవయవాలను ముక్కలు ముక్కలుగా కొరికి తిన్నాయి. ప్రాణాలు కోల్పోయిన మహిళను 32 ఏళ్ల పరిదేవిగా గుర్తించారు. కేవల్ కుమార్, ఆయన భార్య పరిదేవి పస్సాన్ కడిమ్ గ్రామం బయట ఉన్న ఒక మురికివాడలో జీవిస్తున్నారు. అయితే పశువులకు మేతను తీసుకురావడానికి వారు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లొచ్చేవారు. ఈక్రమంలోనే మంగళవారం సాయంత్రం కూడా పరిదేవి.. గడ్డిని తీసుకొచ్చేందుకు పొలాల్లోకి వెళ్లింది. ఆ టైంలోనే పరిదేవిపై 20 వీధి కుక్కలు దాడి చేశాయి.

విశ్వ ప్రయత్నాలు చేసినా..

కుక్కల నుంచి తప్పించుకొని బయటపడేందుకు పరిదేవి విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా అవి వదల్లేదు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. పరిదేవి చనిపోయినా.. ఆ కుక్కలు మాత్రం ఆమె శరీరాన్ని వదల్లేదు. ఆమె అవయవాలను కొరుక్కు తిన్నాయి. పరిదేవి ఛాతి, తల, చేతులు, కాళ్లు, పుర్రెను కొరికేశాయి. తన భార్య పశువులకు గడ్డి తీసుకురావడానికి వెళ్లి ఎంతకూ రాకపోవడంతో కేవల్ కుమార్.. ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ ఆమె శవాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులు పరిదేవి మృతదేహాన్ని సుల్తాన్‌పూర్‌లోని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కొద్దిరోజుల క్రితమే అస్సు కుమార్‌ అనే ఓ పిల్లాడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. అంతకుముందు కూడా పింకీ దేవి అనే మహిళపై దాడి చేయగా.. ఆమె ఇప్పటికీ సుల్తాన్‌పూర్ సివిల్ ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ ఘటనలతో పస్సాన్ కడీమ్ గ్రామ ప్రజలు ఇంటి బయటికి రావాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు.



Next Story

Most Viewed