PM Modi: ఉగ్రవాదులను వెంటాడి మరీ పట్టుకుంటాం: ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

by S Gopi |

తన సందేశాన్ని ప్రపంచ సమాజం ఒక్క మాటైనా వదలకుండా వినాలనే ఉద్దేశంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: ఉగ్రవాదులను వెంటాడి మరీ పట్టుకుంటాం: ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రపంచానికి కీలక సందేశం ఇచ్చారు. ముఖ్యంగా ఈ దాడుల్లో పాల్గొన్న, దీని వెనకున్న వారికి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా అంతర్జాతీయ వేదికలపై కూడా హిందీలోనే ప్రసంగించే ప్రధాని మోడీ, గురువారం బీహార్‌లోని మధుబని జిల్లాలో జరిగిన సభా ప్రసంగం మధ్యలో నేరుగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడ్డం గమనార్హం. తన సందేశాన్ని ప్రపంచ సమాజం ఒక్క మాటైనా వదలకుండా వినాలనే ఉద్దేశంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'పెహల్‌గామ్‌లో జరిగిన దాడికి బాధ్యులైన ప్రతి ఉగ్రవాదిని, అందుకు మద్దతిచ్చిన వారిని భారత ప్రభుత్వం గుర్తించి, వెంటాడి, శిక్షిస్తుంది' అని అన్నారు. పాక్ మిలటరీ సాయంతోనే ఈ దాడి జరిగిందని భారత్ భావిస్తోంది. దాడి చేసిన వారిని ఎంత దూరం వెళ్లినా వెంటాడుతాం, భారత స్పూర్తిని ఎవరూ దెబ్బతీయలేరు. ఉగ్రవాదం తాము విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరు. తమ ప్రజలపై జరిగిన దాడికి న్యాయం దక్కుతుంది. దేశం మొత్తం ఇదే సంకల్పంతో దృఢంగా ఉంది. మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు మాకు మద్దతుగానే ఉన్నారని ' మోడీ తెలిపారు. 'తాను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఉగ్రవాదులు, దాడికి కుట్ర పన్నిన వారికి ఊహించని రీతిలో శిక్ష పడుతుందని ' తీవ్రస్థాయిలో మోడీ వార్నింగ్ ఇచ్చారు.

ప్రధాని మోడీ వ్యాఖ్యలు బీహార్‌లోని మధుబని జిల్లాలో హిందీలో కాకుండా ఇంగ్లీష్‌లో చెప్పడంతో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఈ క్రూరమైన దాడిని వదిలేది లేదని, పరిణామాలు ఉంటాయని, ఉగ్రవాదులను హెచ్చరించామని భారత ప్రభుత్వం తరపున ప్రపంచానికి చెప్పడంతో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగానే పెహల్‌గామ్ దాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలిపిన యూరోపియన్ యూనియన్, యూఎస్, ఇజ్రాయెల్, రష్యా, చైనా దేశాలకు ఎంగ్లీష్‌లోనే కృతజ్ఞతలు చెప్పారు.

Next Story