అధికారంలోకి వస్తే ఆ చట్టం రద్దు : కాంగ్రెస్

by Dishanational4 |
అధికారంలోకి వస్తే ఆ చట్టం రద్దు : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘పౌరసత్వ సవరణ చట్టం - 2019’(సీఏఏ)ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. ‘‘అసోం రాష్ట్రానికి ఎంతో కీలకమైన 1971 సంవత్సరం కటాఫ్ తేదీని సీఏఏ తొలగిస్తోంది. ఇకపై ఆ రాష్ట్రంలో కొత్త కటాఫ్ తేదీ 2014 సంవత్సరం అవుతుంది. ఇది అసోం అమరవీరుల త్యాగాలను అగౌరవపరిచే అంశం’’ అని ఆయన పేర్కొన్నారు. అసోం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి ప్రవేశించే వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి 1971 మార్చి 25 కటాఫ్ తేదీ అవుతుందని పవన్ ఖేరా తెలిపారు. గురువారం అసోంలోని గువహటిలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసోంలో పర్యటించిన ప్రధాని మోడీ..ఆ రాష్ట్రం పొరుగునే ఉన్న మణిపూర్‌ను సందర్శించలేదని ఖేరా విమర్శించారు. ‘‘మణిపూర్‌కు వెళ్లడానికి ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారు? దయచేసి మణిపూర్‌కు వెళ్లండి. అది కూడా మన దేశంలో భాగమే. ఆయన అసోంకు వెళ్లినప్పుడు కనీసం అరగంట టైం కేటాయించి మణిపూర్‌కు వెళ్లిరావాలి’’ అని ఆయన చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అసోంలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ భారీ సీట్లను సాధించి, పాత రికార్డులను బద్దలు కొడుతుందన్నారు. ‘‘రాబోయే ఓటమిని ఊహించబట్టే.. ప్రధానమంత్రి మోడీని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ పదేపదే రాష్ట్ర పర్యటనకు పిలుస్తున్నారు’’ అని ఖేరా ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed