పీఎం మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి

by Ajay Maddhiboyina |

వారణాసిలోని మహ్మూర్‌గంజ్ ప్రాంతానికి చెందిన నిధి తివారి 2014లో ఐఎఫ్ఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.

పీఎం మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి
X

- నిధి 2014 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి

- ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా విధులు

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్)గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిణి నిధి తివారీని నియమించారు. ఇప్పటికే ది అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ ఈ నియామకాన్ని ఆమోదించగా.. తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. నిధి తివారి ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. కాగా, ప్రధాని పీఎస్‌గా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా ప్రస్తుత పాలకుల టర్మ్ ముగిసే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల తర్వాత తివారీ తన ప్రస్తుత పొజిషన్ నుంచి పీఎంవోలో కొత్త బాధ్యతల్లోకి మారనున్నారు.

వారణాసిలోని మహ్మూర్‌గంజ్ ప్రాంతానికి చెందిన నిధి తివారి 2014లో ఐఎఫ్ఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 యూపీఎస్సీ పరీక్షల్లో 96వ ర్యాంకు సాధించిన నిధి.. మొదట వారణాసి అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీసులో జాయిన్ అయ్యారు. 2023 జనవరి 5 నుంచి పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. అంతకు ముందు 2022లో ఆమె అండర్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు. పీఎంఓలో జాయిన్ కాక ముందు విదేశాంగ శాఖలో పని చేశారు. అక్కడ నిరాయుధీకరణ, అంతర్జాతీయ రక్షణ వ్యవహారాల డివిజన్‌లో పని చేశారు. అంతర్జాతీయ సంబంధాల విషయంలో పీఎంవోలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు, రక్షణ సంబంధిత రంగాల్లో ఆమెకు అనుభవం ఉంది. ఆమె నేరుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ ధోవల్‌కు రిపోర్ట్ చేసేవారు.

Next Story