సీరియల్ కిల్లర్ దొరికేశాడు.. 18 మందిని హత్య చేశాడని ఆరోపణ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-18 15:09:47  IST  )

'ఢిల్లీ కసాయి'గా పేరొందిన చందర్‌కాంత్ ఝా (57) అనే నరహంతకుడు బీహార్‌కు పారిపోతుండగా ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం అరెస్టు చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు.

సీరియల్ కిల్లర్ దొరికేశాడు.. 18 మందిని హత్య చేశాడని ఆరోపణ
X

- ఇప్పటికే ముగ్గురి హత్య కేసులో శిక్ష

- 2023లో పెరోల్‌పై విడుదల

- అప్పటి నుంచి కనిపించకుండా పోయిన 'ఢిల్లీ కసాయి'

దిశ, నేషనల్ బ్యూరో:

ఒకప్పుడు వరుస హత్యలతో ఢిల్లీని గడగడలాడించిన కిరాతకుడైన సీరియస్ కిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 'ఢిల్లీ కసాయి'గా పేరొందిన చందర్‌కాంత్ ఝా (57) అనే నరహంతకుడు బీహార్‌కు పారిపోతుండగా ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం అరెస్టు చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. అతడిని పట్టుకోవడానికి కొన్ని నెలలుగా సాగించిన వేట చివరకు ఫలితాన్ని ఇచ్చిందని అడిషనల్ సీపీ పేర్కొన్నారు. చంద్రకాంత్ ఝా 18 మందిని చంపి, వారి ఆనవాళ్లు లేకుండా చేశాడని.. ఈ హత్యలన్నీ 1998 నుంచి 2007 మధ్య వెస్ట్ ఢిల్లీలో చేసినట్లు వెల్లడించారు. 1967లో జన్మించిన బీహార్ నుంచి ఢిల్లీకి 1990లో వలస వచ్చాడు. ఆజాద్‌పూర్ మండీ సమీపంలో ఉంటూ, అనేక చిన్నా చితకా పనులు చేసుకునేవాడు. 8వ తరగతి వరకు చదువుకున్న చందర్‌కాంత్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి ఐదుగురు కుమార్తెలు కూడా ఉన్నారు.

ఒక్కో హత్య వెనుక ఓ కారణం..

ఢిల్లీలో పని కోసం వచ్చే అనేక మందిని చందర్‌కాంత్ చేరదీసేవాడు. వాళ్లకు తిండి పెట్టి, నివాసం ఏర్పాటు చేసి స్నేహంగా ఉండేవాడు. కానీ ఏదైనా చిన్న తప్పు చేసినా వారిని హత్య చేసేవాడు. 1998లో తొలి సారి మంగల్ అలియాస్ ఔరంగజేబ్ అనే వ్యక్తిని ఆదర్శ్‌నగర్‌లో చంపేసి.. అతడిని ముక్కులు ముక్కలుగా నరికి బాడీ పార్ట్స్‌ను ఢిల్లీ అంతటా పారేశాడు. కాగా, అదే ఏడాది అరెస్టు అయిన చందర్‌కాంత్ 2002లో విడుదల అయ్యాడు. ఆ తర్వాత కూడా అతడు హత్యలు చేయడం ఆపలేదు. 2003 జూన్‌లో తన సహాయకుడైన శేఖర్‌ను హైదర్‌పూర్‌లో చంపేశాడు. విపరీతంగా తాగడమే కాకుండా అబద్దాలు చెబుతున్నాడనే కారణంతో ఆ హత్య చేశాడు. అదే ఏడాది నవంబర్‌లో బీహార్ నుంచి వలస వచ్చిన ఉమేష్ అనే వ్యక్తి తనను మోసం చేశాడన్న కారణంతో చంపేసి, తీహార్ జైలు సమీపంలో పడేశాడు.

2005లో గుడ్డూ అనే వ్యక్తిని గంజాయి తాగుతున్నాడనే కారనంతో చంపేశాడు. అలాగే 2006లో అమిత్ అనే వ్యక్తిని స్త్రీ లోలుడుగా మారాడనే నెపంతో హత్య చేసి.. అతని శవాన్ని తీహార్ జైలు వెలుపల పడేశాడు. 2007లో దిలీప్, ఉపేందర్ అనే వ్యక్తుల శవాలు తీహార్ జైలు గేట్ నంబర్ 1 సమీపంలో లభించాయి. ఇందులో ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, మరోవ్యక్తి నాన్ వెజ్ తింటున్నాడనే కారణాల చంపేశాడు. కాగా, 2013లో చందర్‌కాంత్ ఝాను మూడు హత్య కేసుల్లో దోషిగా తేల్చి, కోర్టు రెండు మరణ శిక్షలు విధించిది. కానీ ఆ తర్వాత వాటిని యావజ్జీవ శిక్షలుగా మార్చింది. అయితే 2023లో 90 రోజుల పెరోల్ మీద బయటకు వచ్చిన చందర్‌కాంత్ ఆ తర్వాత పోలీసులకు కనపడకుండా పోయాడు. అప్పటి నుంచి ఒక ప్రత్యేక బృందం అతని కోసం గాలిస్తూనే ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. చివరకు ఇన్ఫార్మర్ల ద్వారా చందర్‌కాంత్ ఆచూకీ కనుగొని, అరెస్టు చేశారు. చందర్‌కాంత్ హత్యల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ 'ఇండియన్ ప్రిడేటర్ - ది బుచర్ ఆఫ్ ఢిల్లీ' అనే డాక్యూ సిరీస్‌ను నిర్మించింది.

Next Story