బెంగాల్‌‌కు వందలాది బృందాలను పంపారు.. మణిపూర్ విషయంలో సైలెంట్ అయ్యారు : మమతా బెనర్జీ

by Disha Web Desk 13 |
బెంగాల్‌‌కు వందలాది బృందాలను పంపారు.. మణిపూర్ విషయంలో సైలెంట్ అయ్యారు : మమతా బెనర్జీ
X

కోల్ కతా: కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. "బెంగాల్‌లో ఏదైనా జరిగినప్పుడు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు వందలాది కేంద్ర బృందాలను పంపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్ హింసా జ్వాలతో మండిపోయినా కేంద్ర సర్కారు ఏమీ చేయకుండా సైలెంట్ అయ్యింది. ఇలా ఎందుకు జరుగుతోందో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో, మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఇంఫాల్ లో హింసాకాండ చోటుచేసుకుందని ఆరోపించారు. అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్యను కూడా మణిపూర్‌ ప్రభుత్వం పారదర్శకంగా బయటపెట్టడం లేదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ.. విద్వేష, హింసాత్మక ఘటనల నివారణలో భాగంగా తమ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ మూవీ స్క్రీనింగ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. "కశ్మీర్ ఫైల్స్ మూవీలో ఒక వర్గాన్ని కించపరిచారు. 'ది కేరళ స్టోరీ' మూవీలో వక్రీకరించిన కథను చూపించారు. మా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బెంగాల్ ఫైల్స్‌ను తయారు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు" అని ఆమె విమర్శించారు.

ఈ నిర్ణయంపై 'ది కేరళ స్టోరీ' సినిమా నిర్మాత విపుల్ షా స్పందించారు. " ఒకవేళ సీఎం మమత అలా చేసి ఉంటే.. మేం చట్టపరంగా ఎదుర్కొంటాం" అని పేర్కొన్నారు. “ది కేరళ స్టోరీ సినిమా విషయంలో నేను సీపీఎం వాళ్లకు మద్దతు ఇవ్వను. వాళ్ళు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు" అని మమత మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేయొద్దని.. స్థిరత్వం, అభివృద్ధి అందించే పార్టీలకే ఓటు వేయాలని కర్ణాటక ఓటర్లను దీదీ కోరారు.



Next Story

Most Viewed