సంక్షేమ పథకాలకు ఓటరు జాబితాతో పనేంటి? బెంగాల్ సర్కార్‌పై ఒవైసీ ఫైర్

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఓటరు జాబితాతో అనుసంధానం చేయడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సంక్షేమ పథకాలకు ఓటరు జాబితాతో పనేంటి? బెంగాల్ సర్కార్‌పై ఒవైసీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఓటరు జాబితాతో అనుసంధానం చేయడంపై ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటరు జాబితా సవరణలో పేర్లు గల్లంతైన నిజమైన లబ్దిదారులకు రేషన్ తదితర ప్రయోజనాలను నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ఆధార్ ధృవీకరణ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు ఓటరు జాబితాతో పనేంటి?’ అని ఒవైసీ శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాధనంతో అమలు చేసే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పౌరుడి హక్కు అని, అవి ఓటర్లకు ఇచ్చే బహుమతులు కావని స్పష్టం చేశారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల పేదలు, మహిళలు, దళితులు, ముస్లింలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

అవినీతితో పతనమవుతున్న టీఎంసీ: దిలీప్ ఘోష్

మరోవైపు, అవినీతి కారణంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పతనం దిశగా సాగుతోందని పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల నిధులను టీఎంసీ నేతలు దారి మళ్లించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని విమర్శించారు.లక్ష్మీ భండార్, అన్నపూర్ణ భండార్ వంటి పథకాల లబ్ధి పొందాలంటే భారత పౌరసత్వం ప్రాథమిక అర్హత అని ఘోష్ గుర్తుచేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే సీఏఏ (CAA) కింద వెంటనే పౌరసత్వం కోసం నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పౌరసత్వం లేనివారు ఈ పథకాలకు అనర్హులవుతారని స్పష్టం చేశారు.

Next Story