పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-05 14:27:39  IST  )

దేశ రాజకీయాల్లో మరో ఆసక్తిర పరిణామ చోటుచేసుకుంది.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో మరో ఆసక్తిర పరిణామ చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని గురువారం న్యూఢిల్లీలో సమర్పించినట్లు లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. తన రాజీనామాపై సీవీ ఆనంద బోస్ స్పందిస్తూ.. వ్యక్తిగత నిర్ణయంతోనే తాను తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. "గవర్నర్ కార్యాలయంలో నేను తగినంత సమయం గడిపాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI)కి తెలిపారు. 2022లో బాధ్యతలు చేపట్టిన ఆయన, సుమారు మూడున్నరేళ్ల పాటు బెంగాల్ గవర్నర్‌గా తన సేవలను అందించారు.

ప్రజలకు చేరువైన 'రాజ్‌భవన్'

ఆనంద బోస్ తన పదవీ కాలంలో రాజ్‌భవన్‌ను కేవలం అధికారిక కార్యాలయంగానే కాకుండా, ప్రజలతో మమేకమయ్యే వేదికగా మార్చారు. ఆయన ప్రవేశపెట్టిన పలు వినూత్న కార్యక్రమాలు విశేష ప్రజాదరణ పొందాయి.

అప్నా భారత్ - జాగ్రతా బెంగాల్: రాష్ట్రంలో సామాజిక సాధికారత కోసం ఈ ప్రచారాన్ని నిర్వహించారు.

ఫైల్-టు-ఫీల్డ్: ఫైళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వందలాది ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దువారే రాజ్యపాల్: గిరిజన మరియు మారుమూల ప్రాంతాల ప్రజల వద్దకే వెళ్లి వారి విన్నపాలను స్వీకరించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పలు అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలతో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన రాజీనామాతో తదుపరి గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

Next Story