పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 37 అభ్యర్థుల్లో 10మంది కోటీశ్వరులే!

by Dishanational2 |
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 37 అభ్యర్థుల్లో 10మంది కోటీశ్వరులే!
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని తొలి దశలో జల్‌పైగురి, కూచ్‌బెహార్‌, అలీపుర్‌దూవార్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు సెగ్మెంట్లలో 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వారిలో 10మంది కోటీశ్వరులే ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అందులో ముగ్గురు స్వతంత్రులు, బీజేపీ నుంచి ఇద్దరు, తృణమూల్ కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరు, సీపీఎం, కాంగ్రెస్, ఆర్‌ఎస్‌పీల నుంచి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులు ఉన్నట్లు తెలిపింది.

జల్పాయ్‌గురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి దేబ్రాజ్ బర్మాన్ ఆస్తుల విలువ రూ.3,89,89,468గా ఉందని పేర్కొంది. వీరందరిలో ఇదే అత్యధికమని అఫిడవిట్‌లను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ తెలిపింది. ఇక, అలీపుర్‌దువార్ నుంచి పోటీ చేస్తున్న చందన్ ఓరాన్ అనే అభ్యర్థి మొత్తం ఆస్తులు రూ.12,117 మాత్రమేనని ఇదే అత్యంత తక్కువని వెల్లడించింది. ఐదుగురు అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు పెట్టుకున్నారని, వారిలో నలుగురిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయని తెలిపింది. అభ్యర్థుల విద్యార్హత వివరాలను విశ్లేషిస్తే 37 మందిలో 16 మందికి 8 నుంచి 12వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉండగా..20 మంది ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక అభ్యర్థి నిరక్షరాస్యుడినని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story