బస్తర్ రూపురేఖలు మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ పర్యటించారు.

బస్తర్ రూపురేఖలు మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ (Bastar) జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి, భద్రతకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా బస్తర్ ప్రాంత సమగ్ర అభివృద్ధి, శాంతిభద్రతలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో మావోయిజాన్ని దాదాపు అంతం చేశామని అమిత్ షా అన్నారు. బస్తర్ ప్రాంత రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందని వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 70 భద్రతా క్యాంపులను (Security Camps) ఇకపై ‘సేవా కేంద్రాలు’గా మార్చబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ కేంద్రాల ద్వారా స్థానిక గిరిజన ప్రజలకు రేషన్, వైద్యం, విద్య వంటి అన్ని ప్రభుత్వ సేవలను ఒకేచోట అందిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.

బస్తర్‌లో గుజరాత్ తరహా మోడల్..

బస్తర్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గుజరాత్ తరహా అభివృద్ధి నమూనాను (Gujarat Model) ఇక్కడ అమలు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం ద్వారా బస్తర్ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. బస్తర్ యువతలో అపరమైన ప్రతిభ దాగి ఉందని.. వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. అందుకు ఒలింపిక్స్ (Olympics) ప్రమాణాల తరహాలో ఇక్కడ క్రీడా మౌలిక వసతులను కల్పిస్తామని, గ్రామీణ స్థాయి క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని అమిత్ షా ప్రకటించారు.

Next Story