జనవరి 1న సరెండర్ అవుతాం.. MMC జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 05:04:41  IST  )

దండకారణ్యాల్లో ఎన్‌కౌంటర్ల మోత మోగుతున్న వేళ మావోయిస్టు పార్టీ నుంచి ఎంఎంసీ జోన్‌ ప్రతినిధి అనంత్‌ పేరుతో లేఖ విడుదలైంది.

జనవరి 1న సరెండర్ అవుతాం.. MMC జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల
X

దిశ, వెబ్‌‌డెస్క్: దండకారణ్యాల్లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ల మోత మోగుతున్న వేళ మావోయిస్టు పార్టీ నుంచి ఎంఎంసీ జోన్‌ ప్రతినిధి అనంత్‌ పేరుతో మరో సంచలన లేఖ విడుదలైంది. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్‌ను కూడా విడుదల చేశారు. ఒక్కొక్కరు కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని పేర్కొన్నారు. దీంతో మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. కానీ ఈ లొంగుబాటు ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలోని భద్రతా బలగాలు, పోలీసుల కూబింగ్ ఆపరేషన్లను నిలిపివేయాలని కోరారు. ఎక్కడా కూడా అరెస్టులు, బూటకు ఎన్‌కౌంటర్లు, దాడులు జరగకూడదని డిమాండ్ చేశారు. పెట్టిన గడవు వరకు ఆపరేషన్లు కొనసాగితే లొంగుబాట్ల ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడతాయని, చివరికి విఫలమవుతుందని పేర్కొన్నారు.

ఎవరు ఎక్కువ సహకారం ఇస్తే ఆ ప్రభుత్వం వెంటే..

గతంలో ఛత్తీస్‌గఢ్‌లో సతీష్ దాదాతో పాటు మహారాష్ట్రలో సోనూ దాదా లాగా సీఎం లేదా హోంమంత్రి సమక్షంలోనే మా కామ్రేడ్స్ ఆయుధాలు పక్కనపెట్టి జనజీవన స్రవంతిలో చేరుతారని లేఖలో అనంత్ ప్రస్తావించారు. వచ్చే ఒక నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. లొంగుబాట్ల విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సహకారం అందిస్తే ఆ రాష్ట్ర సీఎంతో పాటు హోంమంత్రి సమక్షంలోనే ఆయుధాలను అప్పగిస్తామని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ఇప్పటికే రేడియోలో 10 నుంచి 15 రోజుల సమయం కావాలని చెప్పిన మాటను గౌరవిస్తున్నామని, కానీ, జనవరి 1, 2026 తేదీలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్‌ను మందు పెడతామని తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఇంత వరకు స్పందన రాలేదని, ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

కామ్రేడ్స్ హింస్మాత్మక చర్యలు వద్దు..

లొంగుబాట్లపై తేదీ ప్రకటించిన నేపథ్యంలో ఎంఎంసీ పరిధిలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతల నుంచి కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా లేఖలో తెలిపారు. జనవరి 1 2026 వరకు ఎక్కడా ఎలాంటి హింసాత్మక చర్యలు చేపట్టొద్దని ఆదేశించామన్నారు. ఈ సంవత్సరం PLGA వారోత్సవాల దూరంగా ఉండాలని తెలిపినట్లుగా వెల్లడించారు. సరెండర్లపై రేడియో ద్వారా ఆడియో సందేశం విడుదల చేస్తామని అందరూ స్పష్టంగా విని, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించినట్లుగా లేఖలో ప్రస్తావించారు.

కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ విడుదల..

లొగుబాట్లకు సంబంధించి MMC జోన్‌ పరిధిలోని మావోయిస్టులకు రోజూ ఉదయం 11 నుంచి 11.15 వరకు రేడియో ఫ్రీక్వెన్సీ 435.715 MHz ద్వారా ఒకరితో ఒకరు సంప్రదించవచ్చని ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన లేఖను మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు రేడియోలో, జాతీయ మీడియాలో వెంటనే ప్రచురించాలని, తమ ఆడియో సందేశాన్ని కూడా అన్ని మీడియా సంస్థలు వార్తా సమయానికి ముందు ప్రసారం చేయాలని మావోయిస్టులు కోరారు.

తాజా పరిణామంతో మూడు రాష్ట్రాల భద్రతా దళాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలర్ట్‌కు అయింది. సరెండర్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పటికే సానుకూల సంకేతాలు ఇవ్వగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story