పాక్‌పై ఇరాన్ ఎటాక్.. ఇండియా రియాక్షన్ ఇదీ..

by Dishanational4 |
పాక్‌పై ఇరాన్ ఎటాక్.. ఇండియా రియాక్షన్ ఇదీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ‘జైష్ అల్ అద్ల్’ ఉగ్రస్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన ఘటనపై భారత్ స్పందించింది. ఆ దాడి పాక్, ఇరాన్‌లకు మాత్రమే సంబంధించిన సమస్య అని తేల్చి చెప్పింది. ‘‘ఉగ్రవాదాన్ని భారత్ అస్సలు ఉపేక్షించదు. ఏదైనా దేశం ఆత్మరక్షణ కోసం ఏవైనా చర్యలు తీసుకుంటే వాటిని మేం అర్ధం చేసుకుంటాం’’ అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఇరాన్ కూడా ఆత్మరక్షణ కోసమే పాక్‌పై దాడి చేసి ఉండొచ్చని కామెంట్ చేసింది. ఈవిషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. ‘‘మేం పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. కానీ మా జాతీయ భద్రతతో రాజీపడబోం’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఆయన ఈ అంశంపై తమ దేశం వైఖరిని వెల్లడించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ తరహా ఏకపక్ష చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఉగ్రవాదం అన్ని దేశాలకూ ముప్పే’’ అని తెలిపారు.

Next Story

Most Viewed