నక్సల్ రహిత దేశంగా భారత్‌ను మార్చాం.. లోక్‌సభలో అమిత్ షా బిగ్ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-30 13:57:58  IST  )

నక్సలిజం నిర్మూలనపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని.. వారికి మరో ఆప్షన్ లేదని అన్నారు.

నక్సల్ రహిత దేశంగా భారత్‌ను మార్చాం.. లోక్‌సభలో అమిత్ షా బిగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగుస్తుండటంతో ఇంకా లొంగిపోని మావోయిస్టుల పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశంలో మావోయిస్టుల నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. బస్తర్‌లో దాదాపు నక్సలిజం అంతమైందని ఆయన ప్రకటించారు. బస్తర్ పరిధిలోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు గడువుకు ముందే లొంగిపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నక్సల్స్ అందరూ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని, వారికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. మొత్తం 30 మంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌ అయ్యారని సభలో ప్రస్తావించారు. ఇప్పుడు భారత్ మావోయిస్టు రహిత దేశమని తెలిపారు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెబుతామని, ఆయుధాలను వీడికపోతే అంతుచూస్తామని అమిత్ షా లోక్‌సభ వేదికగా మాస్ వార్నింగ్ ఇచ్చారు.

నక్సలిజం నశించాలని గిరిజనుల ఆకాంక్ష..

కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదని.. వారితోనే దేశంలో నక్సలిజం పెరిగిందని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ (NDA) అధికారంలోకి వచ్చాకే వారి జీవితాల్లో మార్పులు వచ్చాయని అన్నారు. ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామని, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరిచామని తెలిపారు. భారత్‌ను నక్సల్ రహిత దేశంగా మార్చామని, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. గత 12 ఏళ్లలో ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరిగాయని, నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాళ్లవి విదేశీ సిద్ధాంతాలు..

మావోయిస్టుల నిర్మూలనలో ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచారని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఈ సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారని, హింసను కాదని హితవు పలికారు. ఎందరో భద్రతా సిబ్బందిని నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారని, వారి అజెండాలో అభివృద్ధి లేదని, కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారని మండిపడ్డారు. తాను బస్తర్ యువకులను కలిశానని, వారంతా నక్సలిజాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావులేదని, నక్సలైట్లను భగత్ సింగ్, బిర్సాముండాలతో పోల్చకూడదని వ్యాఖ్యానించారు. ప్రజలను చంపేవారు దేశభక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నక్సలైట్లు తమ సిద్ధాంతాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, వారికి భారతీయులెవరూ ఆదర్శం కాదని, కేవలం మావో మాత్రమే ఆదర్శమని అమిత్ షా ఎద్దేవా చేశారు.

Next Story