Trump: ట్రంప్‌వన్నీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..!

by Shamantha N |

భారత ఎన్నికల కోసం అమెరికా 21 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Trump: ట్రంప్‌వన్నీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల కోసం అమెరికా 21 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దానిపైనే కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాట‌ల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే, వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో ఈ నిధుల గురించి ఎలాంటి రికార్డులు లేవని నివేదించింది. భారతదేశానికి అమెరికా నిధులు ఇచ్చిందని ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE) చేసిన వాదనల్ని వాషింగ్టన్ పోస్ట్ తిప్పికొట్టింది. యూఎస్ఏఐడీ (USAID) బంగ్లాదేశ్ కోసమే ఆ డీల్ కుదుర్చుకుందని పేర్కొంది. 2008 నుంచి ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రాజెక్టుకు భారత్ నిధులు పొందలేదన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాన్ని వాషింగ్టన్ పోస్టు సమర్థించింది. కాగా.. ఈ కథనం బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. బీజేపీ, ఆపార్టీ గుడ్డి మద్దతుదారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా నుంచి ఎలాంటి నిధులు రాలేదనన్న ది వాషింగ్టన్ పోస్ట్ కథనం కాంగ్రెస్‌కి ఆయుధంగా మారింది.

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

అయితే, తకు ముందు యూఎస్ఏఐడీ నుంచి వచ్చిన ఆ నిధుల్ని బంగ్లాదేశ్ కు తరలించారని.. భారత్ కు కాదని.. బీజేపీ ఆరోపించింది. దేశ వ్య‌తిరేక కార్య‌కలాపాలు కొన‌సాగించేందుకు ఆ నిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్జీవోల‌కు ద‌క్కిన‌ట్లు కాషాయ పార్టీ చెప్పుకొచ్చింది. భార‌త్ వ్య‌క్తిగ‌త సార్వ‌భౌమ దేశ‌మ‌ని, మ‌న అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో విదేశాలు ఎందుకు జోక్యం చేసుకోవాల‌ని బీజేపీ నేత గౌరవ్ భాటియా అన్నారు. ప్ర‌ధాని మోడీని త‌ప్పించేందుకు రాహుల్ గాంధీ విదేశీ సాయం కోరిన‌ట్లు ఆరోపించారు. స్వశక్తితో మోడీని ఓడించలేరని.. అందుకే విదేశీ సాయం తీసుకుంటున్నారని విమర్శించారు. మోడీని విమర్శించే క్రమంలో భారత్ నే ద్వేషిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తున్న‌ట్లు గౌరవ్ భాటియా చెప్పుకొచ్చారు. అయితే, ఆ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఆ నిధులను కమలం పార్టీయే వాడుకుందని ఆరోపించింది. యూఎస్ఏఐడీతో గ‌తంలో బీజేపీ నేత స్మృతి ఇరానీకి సంబంధాలు ఉండేవ‌ని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. యూఎస్ఏఐడీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స్మృతి ఇరానీ ఉన్నార‌ని, ఆమె నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆ నిర‌స‌న‌ల‌కు అమెరికానే ఫండింగ్ ఇచ్చిందా అని ప్ర‌శ్నించారు. 21 మిలియ‌న్ల డాల‌ర్లు భారత్ కు వస్తే.. అప్పుడు ఐబీ, రా, అజిత్ డోబాల్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

Next Story