- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Waqf bill: వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజడం (DMK) ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు (Waqf amendment bill) కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం స్టాలిన్ (Stalin) గురువారం శాసనసభలో ఈ రిసల్యూషన్ ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అయినప్పటికీ ప్రభుత్వం తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ముస్లింల మనోభావాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సవరణలు మైనారిటీల హక్కులకు ప్రమాదమని తెలిపారు. ఈ బిల్లు వక్ఫ్ బోర్డును బలహీనపర్చడం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో జోక్యం చేసుకోవడం లక్ష్యంగా ఉందని విమర్శించారు. ‘ప్రభుత్వం గుర్తించిన ఏ వక్ఫ్ ఆస్తి కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకి రాదని సవరణలు చెబుతున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు’ అని చెప్పారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ (vasathi Srinivasan) తీవ్రంగా స్పందించారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సవరణలు తీసుకువచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, వక్ఫ్ కు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయని అందుకే కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తోందని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం లక్ష్యంగా బిల్లును రూపొందించామని తెలిపారు. మరోవైపు ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష ఏఐఏడీఎంకే స్వాగతించింది.






