డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ.. ఈ రాత్రి లోక్‌సభలో ఏం జరుగబోతోంది?

by Gantepaka Srikanth |

భారత పార్లమెంటులో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ.. ఈ రాత్రి లోక్‌సభలో ఏం జరుగబోతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పార్లమెంటులో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు (131వ రాజ్యాంగ సవరణ) సంబంధించి కీలక సవరణలు, అలాగే లోక్‌సభ స్థానాల పెంపునకు ఉద్దేశించిన 'డీలిమిటేషన్ బిల్లు-2026'పై నేడు లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. రాత్రి 7 గంటల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లులపై సభలో హోరాహోరీ చర్చ సాగుతోంది. "మన ఇంట్లోని తల్లి, సోదరి, కూతురు, భార్యను దృష్టిలో ఉంచుకుని, అంతరాత్మ ప్రబోధానుసారం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపండి" అని ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లుకు మద్దతిస్తూనే, తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మహిళా రిజర్వేషన్ కోసం తెచ్చిన బిల్లు కాదని, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర అని ఆరోపించారు. ఈ బిల్లును సభలో ఓడించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

మెజార్టీ లెక్కలు ఇవే..

రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి మూడింట రెండొంతుల (2/3) మెజార్టీ తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలకు గాను, అందరూ హాజరైతే బిల్లు ఆమోదానికి 360 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ బలం 292గా ఉంది. ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. ఇతరులు 15 మంది ఉన్నారు. అయితే బిల్లు ఆమోదం పొందాలంటే రెండొంతుల మెజార్టీ ఓట్లు అప్పనిసరి. అంటే 360 ఓట్లు కావాలి. ఎన్డీయేకు సొంతంగా 2/3 మెజార్టీ లేకపోవడంతో, తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు లేదా విపక్షాల నుంచి ఓట్లు రాబట్టడంపైనే ఈ బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది. రాత్రి జరగబోయే ఓటింగ్ ప్రక్రియలో భారత రాజకీయ ముఖచిత్రం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Next Story