ప్రధాని మోడీకి వెంకయ్య నాయుడు ఊహించని షాక్!

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీకి వెంకయ్య నాయుడు ఊహించని షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వెంకయ్య నాయుడు.. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ఉప రాష్ట్రపతి పదవి వరకు చేరుకున్న వ్యక్తి. ఇటీవలే ఆయన చేపట్టిన వైస్ ప్రెసిడెంట్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ చైర్మన్‌గా అనేక సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష నేతలకు సలహాలు సూచనలు చేసిన వెంకయ్య నాయుడు తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాటల చేత ఎవరినీ నొప్పించకుండా విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగే భాషా సామర్థ్యం కలిగిన వెంకయ్య తాజాగా మోడీకి షాకిచ్చేలా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ప్రశంసిస్తూనే మరోవైపు మోడీ ఇన్నాళ్లు పట్టించుకోని ఓ కీలక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇకనైనా ఈ పని చేయాలని సూచించడం బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీల్లో చర్చకు దారి తీస్తున్నది.

వెంక‌య్య వాగ్బాణాలు:

ప్రధాని మోడీ నిర్ణయాలపై ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. సొంత మెజారిటీ కలిగి ఉండటంతో ప్రధాని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సమయాల్లోనూ కనీసం ప్రతిపక్షాలను కన్సిడర్ చేయడం లేదనేది మోడీపై ఉన్న ఆరోపణలు. తాజాగా ఇదే అంశంపై వెంకయ్య నాయుడు వాగ్బాణాలు సంధించారు. శుక్రవారం ఢిల్లీలో మోడీ 2019 మే నుండి 2020 మే మధ్య కాలంలో చేసిన ప్రసంగాలతో ముద్రించిన 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' పుస్తకాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌తో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రాజకీయ పక్షాలు విశాల దృక్పథంతో ఉండాలని సూచించారు. రాజకీయ కారణాలతో కొందరు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను అపార్థం చేసుకుంటున్నారని చెబుతూనే ప్రధాని మోడీ కూడా తరచుగా అన్ని పక్షాల రాజకీయ నాయకులతో భేటీ కావాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా అన్ని వర్గాలకు మోడీ వైఖరి, విధానాల పట్ల ఉన్న అనుమానాలు, ఆయన విధానాల పట్ల ఉన్న అపార్థాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు.

వెంకయ్య మాటల వెనుక కారణం ఇదేనా?

వెంకయ్యకు రాష్ట్రపతిగా ప్రమోషన్ ఇస్తారనే టాక్ వినిపించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం అలా చేయలేదు. కనీసం ఉప రాష్ట్రపతిగానైనా మరోసారి రెన్యువల్ చేస్తారని అనుకుంటే అందుకు కూడా మోడీ, అమిత్ షా అంగీకరించలేదు. దేశ రాజకీయాలతో ఎంతో అనుభవం కలిగిన వెంకయ్య నాయుడు పొలిటికల్ లైఫ్‌కు ఎండ్ కార్డు పడినట్లైంది. అయితే, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం అని చూపిస్తున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని అధికారాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాల నుంచి విద్యుత్ సంస్కరణల వరకు ఇదే తంతు కొనసాగుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. భారతదేశం సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించించినప్పటికీ మోడీ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికిందని ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. మోడీ ఎవరిని పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఏకం అవుతున్న సందర్భం ఇది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి గడ్డు పరిస్థితులు వస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ తరచూ అన్ని పక్షాల రాజకీయ నాయకులతో భేటీలు నిర్వహించాలని వెంకయ్య నాయుడు సూచించడం ఆసక్తికరంగా మారింది. మరి వెంకయ్య మాటలను మోడీ ఆచరణలో పెడతారో లేదో చూడాలి మరి.


Next Story