Vande Bharat: వందేభారత్ ప్రయాణికుడి భోజనంలో పురుగులు

by S Gopi |

ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడు సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది.

Vande Bharat: వందేభారత్ ప్రయాణికుడి భోజనంలో పురుగులు
X

దిశ, నేషనల్ బ్యూరో: వందేభారత్ రైళ్లలో అందించే ఆహారానికి సంబంధించి ప్రయాణీకులు ఫిర్యాదులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ వందేభారత్ రైల్లో ప్రయాణీకులకు ఇచ్చిన ఆహారంలో పురుగులు ఉండటంతో, ఆ కోచ్‌లోని వాళ్లంతా ఆ ఆహారాన్ని తినడం మానేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడు సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడు అహ్మదాబాద్-ముంబై వందే భారత్ రైలులో ఎదురైన ఘటనను ఫోటోలతో సహా పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రైల్లో ఇచ్చిన భోజనంలో తనకు ఒక పురుగు కనిపించింది. అదే కోచ్‌లో ఇలాంటి రెండు సంఘటనలు గమనించామని, దీంతో ప్రయాణికులు ఎవరూ భోజనం చేయలేదని అతను ఆరోపించాడు. అధికారులను ట్యాగ్ చేస్తూ, చర్యలు తీసుకోవాలని, ఆహార భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడాలని కోరాడు. దీనిపై స్పందించిన ఐఆర్‌సీటీసీ అధికారిక ప్రకటనను జారీ చేసింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి, సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 10 లక్షల జరిమానాతో పాటు కాంట్రాక్ట్ రద్దు నోటీసు ఇచ్చినట్టు పేర్కొంది. శుభ్రత, కీటకాల నియంత్రణ కోసం వంటగదిని సీల్ చేశామని, ప్రయాణికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.

Next Story