- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US Tariff: రష్యా చమురుపై అమెరికా కొత్త బిల్లు
గతంలో ఈ సుంకాలను 500 శాతంగా ప్రతిపాదించినప్పటికీ, ప్రస్తుత రూపంలో దాన్ని 100 శాతానికి పరిమితం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచే దిశగా అమెరికా సెనేటర్లు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. భారత్, చైనాలతో పాటు స్లోవేకియా, హంగేరి, అజర్బైజాన్ వంటి ఐదు ప్రధాన దేశాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధించాలని కోరుతూ అమెరికా సెనేటర్ల ద్విపక్ష (డెమోక్రాట్, రిపబ్లికన్) బృందం ఒక శక్తివంతమైన బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో ఈ సుంకాలను 500 శాతంగా ప్రతిపాదించినప్పటికీ, ప్రస్తుత రూపంలో దాన్ని 100 శాతానికి పరిమితం చేశారు. కేవలం సుంకాల బిల్లుగా కనిపిస్తున్నప్పటికీ, ఇది వాస్తవానికి రష్యా రక్షణ, ఆర్థిక రంగాలతో పాటు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత వ్యాపారవేత్తల ఆర్థిక మూలాలను దెబ్బతీసే పూర్తిస్థాయి ఆంక్షల వ్యూహమని అమెరికా సెనేటర్లు స్పష్టం చేశారు. రష్యా ఇంధన ప్రాజెక్టులు, ఆర్థిక సంస్థలు, రహస్య ట్యాంకర్ల నెట్వర్క్పై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ బిల్లులో కేవలం రష్యా నుండి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసే ఐదు ప్రధాన దేశాలనే లక్ష్యంగా చేసుకున్నారు. రష్యా నుండి గ్యాస్ కొనుగోలు చేస్తున్న 15 యూరోపియన్ మిత్రదేశాలకు మాత్రం ఈ సుంకాల నుండి మినహాయింపు ఇచ్చారు. యూరప్ దేశాల కొనుగోళ్లు వాటి మొత్తం అవసరాలలో చాలా చిన్న భాగమేనని, పైగా వారు మాస్కోపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున వారిని ఇందులో చేర్చలేదని అమెరికా ప్రతినిధులు వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని ఆంక్షలను సడలించే అధికారం కల్పించే నిబంధనను కూడా చేర్చారు. ఈ బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించి, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్కు నివాళిగా క్యాపిటల్ హిల్లో రెండు పార్టీల సెనేటర్లు కలిసి ఈ చట్టాన్ని ఆవిష్కరించారు. అయితే, గత నెలలోనే బలవంతపు శ్రమతో కూడిన వస్తువుల దిగుమతి నెపంతో భారత్ సహా 54 దేశాలపై 12.5 శాతం సుంకాలు ప్రతిపాదించిన అమెరికా, ఇప్పుడు ఏకంగా 100 శాతం సుంకాల అస్త్రాన్ని తెరపైకి తేవడం భారత్తో దౌత్య సంబంధాలకు సరికొత్త సవాలుగా మారనుంది.






