భారత సంస్కృతికి ప్రపంచ గౌరవం.. దీపావళి పండుగకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు

by Malleboina Mahesh |   (  Updated:2025-12-10 08:10:55  IST  )

భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

భారత సంస్కృతికి ప్రపంచ గౌరవం.. దీపావళి పండుగకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే వెలుగుల పండుగ దీపావళిని యునెస్కో (UNESCO) తన 'మానవజాతి యొక్క అరూప సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితా (Representative List of the Intangible Cultural Heritage of Humanity)' లో చేర్చింది. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో అంతర ప్రభుత్వ కమిటీ యొక్క 20వ సమావేశంలో ఈ చారిత్రక నిర్ణయాన్ని డిసెంబర్ 10న ప్రకటించారు. దీంతో, యోగా, దుర్గా పూజ, కుంభమేళా వంటి వాటి తర్వాత యునెస్కో జాబితాలో చేరిన 16వ భారతీయ సంప్రదాయంగా దీపావళి నిలిచింది.

ఈ గుర్తింపుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ దీపావళి పండుగ మన సంస్కృతి, నైతికతతో ముడిపడి ఉందని, ఇది మన నాగరికతకు ఆత్మ అని కొనియాడారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు అంధకారంపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఈ పండుగ యొక్క విశ్వవ్యాప్త సందేశాన్ని ప్రపంచానికి చాటుతుందని అన్నారు. యునెస్కో గుర్తింపు ద్వారా ఈ పండుగ ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం మరింత పెరగడంతో పాటు, దీనిని భవిష్యత్ తరాల కోసం 'జీవన వారసత్వం'గా పరిరక్షించాల్సిన బాధ్యత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story