ప్రైవేట్ వీడియోలతో అంకుల్ బ్లాక్ మెయిల్.. బెంగళూరు టెకీ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

సుహాసి సింగ్ (24) అనే యువతి గత వరుసకు మామ అయ్యే ప్రవీణ్ సింగ్, అతని భార్యతో కలిసి గత ఆరేళ్లుగా కేఆర్ పురంలోని ఎస్వీఎస్ ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది.

ప్రైవేట్ వీడియోలతో అంకుల్ బ్లాక్ మెయిల్.. బెంగళూరు టెకీ ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో:

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. వరుసకు మామ అయ్యే వ్యక్తి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన యువతి పెట్రోల్ పోసి, నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జనవరి 12 ఈ ఘటన జరుగగా, కీలక నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. సుహాసి సింగ్ (24) అనే యువతి గత వరుసకు మామ అయ్యే ప్రవీణ్ సింగ్, అతని భార్యతో కలిసి గత ఆరేళ్లుగా కేఆర్ పురంలోని ఎస్వీఎస్ ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. మృతురాలికి ప్రవీణ్ సింగ్‌తో ఉన్న సాన్నిహిత్యం ఆ తర్వాత శారీరిక సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా ప్రవీణ్ సింగ్ మొబైల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి.. వాటిని పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేశాడు. అయితే కొంత కాలంగా ప్రవీణ్ సింగ్‌ను సుహాసి సింగ్ దూరం పెట్టింది. అంతే కాకుండా మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు నిందితుడు తెలుసుకున్నాడు. ఆమె మొబైల్‌లో వేరే వ్యక్తితో చేసిన చాట్‌ను కూడా చదివాడు. అయినా సరే తనతో సంబంధం కొనసాగించాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడు. గత ఆదివారం ఐటీపీఎల్ మెయిన్ రోడ్డులో ఉన్న రాధా హోటల్‌లో హోటల్ బుక్ చేసి అక్కడకు రావాలని ఒత్తిడి తెచ్చాడు. సుహాసి సింగ్ రానని చెప్పడంతో.. గతంలో తీసిన వీడియోలు, ఫొటోలు తన తల్లిదండ్రులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఒక బాటిల్‌లో పెట్రోల్ తీసుకొని హోటల్ రూమ్‌కు వెళ్లింది. అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకుంది. మంటలు ఆర్పడానికి బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి నీళ్లు పోశాడు. కానీ అప్పటికే సుహాసి సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదే రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మంటలు ఆర్పే క్రమంలో ప్రవీణ్ సింగ్‌ చేతికి కూడా గాయాలయ్యాయి. కాగా, హెచ్ఏఎల్ పోలీసులు ప్రవీణ్‌ను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. అతని వద్ద నుంచి మొబైల్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story