Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా ప్రయాణానికి స్పాన్సర్ చేసిన యూఏఈ కంపెనీ

by S Gopi |

ట్రావెల్ వ్లాగ్‌ల కోసం వచ్చే స్పాన్సర్‌షిప్‌లలో యూఏఈకి చెందిన ఓ ట్రావెల్ కంపెనీ ఉందని గుర్తించారు.

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా ప్రయాణానికి స్పాన్సర్ చేసిన యూఏఈ కంపెనీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ 'గూఢచారి' యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆమె విదేశీ ప్రయాణాలు, లగ్జరీ లైఫ్ గురించి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తోందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించిన అధికారులకు.. ట్రావెల్ వ్లాగ్‌ల కోసం వచ్చే స్పాన్సర్‌షిప్‌లలో యూఏఈకి చెందిన ఓ ట్రావెల్ కంపెనీ ఉందని గుర్తించారు. యూఏఈకి చెందిన వెగో కంపెనీ జ్యోతి మల్హోత్రా వీడియోలకు స్పాన్సర్ చేసిందని, ఈ కంపెనీకి దుబాయ్, సింగపూర్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ కార్యకలాపాల నిర్వహణకు లైసెన్స్ ఉందని కనుగొన్నారు. కంపెనీకి అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) నుంచి గుర్తింపు ఉంది. ఆమె స్పాన్సర్‌లందరినీ విశ్లేషిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 'ట్రావెల్ విత్ జో' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న జ్యోతికి దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీగో పాకిస్తాన్‌కు నిధులు సమకూర్చిందనే ఆధారాలు లేనప్పటికీ, దేశంలో కంపెనీ కార్యకలాపాలు, జ్యోతి వ్యవహారంతో సంబంధాలు ఈ కేసులో వివాదాస్పదంగా మారాయి. క్యోతి మల్హోత్రా ప్రయాణ ఖర్చుల కోసం వెగో స్పాన్సర్ చేయడంపై దర్యాప్తు అధికారులు మరింత సమగ్రంగా వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

కస్టడీ పొడిగింపు

మరోవైపు జ్యోతి మల్హోత్రా పోలీసుల రిమాండ్‌ను నాలుగు రోజులు పొడిగిస్తూ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గూఢచర్యం కేసులో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో అరెస్టు అయిన 12 మందిలో మల్హోత్రా కూడా ఉన్నారు. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న గూఢచారి నెట్‌వర్క్‌తో కలిసి వీరు పనిచేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమెకు సైనిక, రక్షణ సంబంధిత సమాచారం అందించిందనేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. కానీ ఆమెకు కొందరు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ వర్గాలతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో ఆమె 2023, నవంబర్ నుంచి టచ్‌లో ఉన్నట్టు తేలింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో మే 13న భారత్ అతడిని బహిష్కరించింది. పోలీసులు జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. మల్హోత్రా నాలుగు బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను ప్రశ్నించారు.

Next Story