భారత్, చైనాలకు ట్రంప్ టారిఫ్ షాక్.. ‘సెకండరీ శాంక్షన్స్’ విధించేందుకు రెడీ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-14 17:14:58  IST  )

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలు విధించేందుకు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు.

భారత్, చైనాలకు ట్రంప్ టారిఫ్ షాక్.. ‘సెకండరీ శాంక్షన్స్’ విధించేందుకు రెడీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా (Russia)తో వ్యాపారాలు కొనసాగిస్తున్న భారత్, చైనా వంటి ప్రధాన దేశాలపై భారీగా ద్వితీయ శ్రేణి ఆంక్షలు విధిస్తూనే, అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రష్యాను ఆర్థికంగా గరిష్ట ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

రష్యా ఆయిల్‌పై ట్రంప్ ఆగ్రహం..

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధ నిధుల వనరులను దెబ్బతీసేందుకు అమెరికా కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తూ, దానిని అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి విక్రయించడం ద్వారా ఆయా దేశాలు భారీ లాభాలు గడిస్తున్నాయని, ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా తోడ్పడుతోందని వైట్‌హౌస్ ఆరోపించింది. ఇప్పటికే ఈ ఆంక్షల పర్వంలో భాగంగా భారతీయ దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంతో, మొత్తం సుంకాల రేటు 50 శాతానికి చేరింది. ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేని.. భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను మీరు చూడబోతున్నారని హెచ్చరించారు.

మరోవైపు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన బిల్లు శాంక్షన్స్ రష్యా యాక్ట్ (Sanctioning Russia Act)కు అధ్యక్షుడు ట్రంప్ పూర్తి మద్దతు లభించింది. ఈ బిల్లు చట్టంగా మారితే, రష్యా ఇంధన రంగానికి కస్టమర్లుగా ఉన్న దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 500 శాతం వరకు సెకండరీ టారిఫ్‌లను విధించే అపరిమిత అధికారం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు లభిస్తుంది. రష్యా ఆయిల్‌ను 70 శాతానికి పైగా కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని యూఎస్ సెనేటర్లు గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా విధిస్తున్న ఈ టారిఫ్‌లు అన్యాయమైనవని భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది.

Next Story