కేజ్రీవాల్‌‌కు ఇన్సులిన్ వ్యవహారం.. తెలంగాణకు లింక్ !

by Dishanational4 |
కేజ్రీవాల్‌‌కు ఇన్సులిన్ వ్యవహారం.. తెలంగాణకు లింక్ !
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షుగర్ లెవల్స్ ఆందోళనకరంగా లేవు. ఆయనకు ఇప్పుడు ఇన్సులిన్ అక్కర్లేదు’’ అని పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తిహార్ జైలు అధికారులు ఓ నివేదికను సమర్పించారు. నెల రోజులుగా తిహార్ జైలులో తనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక నిందితుడు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఈ రిపోర్టు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీని ప్రకారం.. కేజ్రీవాల్ తెలంగాణలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద షుగర్ ట్రీట్మెంట్ పొందేవారు. ఆ డాక్టర్ సూచన మేరకు కొన్ని నెలల క్రితమే ఇన్సులిన్ తీసుకోవడాన్ని కేజ్రీవాల్ ఆపేశారు. ప్రస్తుతం ఆయన మెట్‌ఫార్మిన్ అనే మధుమేహ నిరోధక ఓరల్ టాబ్లెట్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. ‘‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఢిల్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని చెప్పుకునే కేజ్రీవాల్.. తెలంగాణ డాక్టర్ దగ్గర రహస్యంగా షుగర్ చికిత్స చేయించుకోవడం విడ్డూరంగా ఉంది. కనీసం ఆ చికిత్సకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కేజ్రీవాల్ దగ్గర లేవు’’ అని తమ నివేదికలో తిహార్ జైలు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.

జైలులో సరిపడా ఇన్సులిన్ స్టాక్

‘‘తిహార్ జైలులో సరిపడా ఇన్సులిన్ స్టాక్ ఉంది. కేజ్రీవాల్‌కు అవసరమైతే వెంటనే దాన్ని అందించే వసతులు ఆస్పత్రిలో ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశానని స్వయంగా కేజ్రీవాలే చెప్పారు. అందుకే మేం ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదు’’ అని నివేదికలో ప్రస్తావించారు. ఇక ఈ నివేదికపై ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిషి ఘాటుగా స్పందించారు. ‘‘సరిపడా ఇన్సులిన్ స్టాక్ జైలులో ఉన్నా కేజ్రీవాల్‌కు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు ? ఆయన ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు ?’’ అని ఆమె జైలు అధికారులను ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అతిషి ఆరోపించారు. గత 12 ఏళ్లుగా కేజ్రీవాల్ ప్రతిరోజూ ఇన్సులిన్‌ను తీసుకుంటున్నారని, అయితే గత నెలరోజులుగానే అది తిహార్ జైలు అధికారులు అందించడం లేదన్నారు.



Next Story

Most Viewed